మారుతీ అసిస్టెన్స్ మీవెంటే..
కారు ఆగిన వెంటనే వాలిపోనున్న సిబ్బంది
రహదారిపైనే తక్షణ సహాయం
తొలి దశలో 250 నగరాల్లో సేవలు
న్యూఢిల్లీ: నడిరోడ్డుపైన ఒక్కసారిగా కారు ఆగిపోతే కలిగే అసౌకర్యాన్ని తమ కస్టమర్ల దరిచేరనివ్వకుండా చూడాలని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) భావిస్తోంది. ఇందుకోసం కారు ఎక్కడ ఆగిపోయినా వెంటనే వాలిపోయే తక్షణ సహాయ బృందాలను శుక్రవారం ప్రారంభించింది. క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ) పేరిట ఇక నుంచి ద్విచక్ర వాహనాలపై తమ బృందాలు సేవలందిస్తాయని కంపెనీ ప్రకటించింది.
మొదటి దశలో దేశవ్యాప్తంగా మొత్తం 250 నగరాలలో 350 బైక్ల ద్వారా శీఘ్ర సేవలను ప్రారంభించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కెనిచి అయుకవా ప్రకటించారు. 2020 నాటికి ఈ సేవలను 500 నగరాల్లో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వారంటీ లేని వాహనాలకు రూ.450–రూ.575 వరకు విజిటింగ్ చార్జీ వసూలు చేస్తున్నట్లు కంపెనీ వివరించింది. రహదారిపై సహాయం కోసం సగటున నెలకు 10,000 కాల్స్ వస్తున్నట్లు ఎంఎస్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సర్వీస్) పార్థో బెనర్జీ తెలిపారు.