2020 నుంచి ఆ కార్ల అమ్మకాల నిలిపివేత | Maruti To Stop Selling Diesel Cars In India | Sakshi
Sakshi News home page

2020 నుంచి ఆ కార్ల అమ్మకాల నిలిపివేత

Apr 25 2019 5:42 PM | Updated on Apr 26 2019 5:46 AM

Maruti To Stop Selling Diesel Cars In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి డీజిల్‌ కార్లను విక్రయించబోమని అతిపెద్ద కారు తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్‌ భారీగా పడిపోవడంతో తాము 2020, ఏప్రిల్‌ 1 నుంచి డీజిల్‌ కార్ల అమ్మకాన్ని చేపట్టడంలేదని మారుతి సుజుకి చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. కాగా 1500 సీసీ పైబడిన డీజిల్‌ కార్లను మాత్రం విక్రయించేందుకు కంపెనీ మొగ్గుచూపుతోంది. మారుతి ఇటీవల లాంఛ్‌ చేసిన బాలెనో ఇదే కేటగిరీకి చెందిన వాహనం కావడం గమనార్హం.

కేవలం 1500 సీసీ డీజిల్‌ వాహనానికే భవిష్యత్‌ ఉందని, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా డీజిల్‌ వాహనాల తయారీపై తాము ఓ నిర్ణయం తీసుకుంటామని భార్గవ వెల్లడించారు. బీఎస్‌ 5 ప్రమాణాలు అమల్లోకి వస్తే 1500 సీసీ లోపు డీజిల్‌ ఇంజన్‌లకు ఆదరణ ఉండదని మారుతి భావిస్తోంది. బీఎస్‌ 4 వాహనాల విక్రయం, రిజిస్ర్టేషన్‌కు 2020 మార్చి 31ని డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్ధారించిన సంగతి తెలిసిందే. బీఎస్‌ 6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు గిరాకీ పెరుగుతుందని తదనుగుణంగా తమతో పాటు డీలర్లు సమిష్టిగా పనిచేసి ధరలు నిలకడగా ఉండేందుకు పూనుకోవాలని అన్నారు. గడువులోగా తాము తమ 16 మోడళ్లను అప్‌డేట్‌ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల విషయంలో అనిశ్చితి నెలకొందని అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement