పోస్ట్‌ బ్యాంకు నుంచి రుణాలు | Loans from Post Bank | Sakshi
Sakshi News home page

పోస్ట్‌ బ్యాంకు నుంచి రుణాలు

Aug 9 2018 12:57 AM | Updated on Aug 9 2018 12:57 AM

Loans from Post Bank - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టు కట్టడం ద్వారా రుణాలు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఉత్పత్తులను అందించేందుకు సన్నద్ధమవుతోంది. థర్డ్‌ పార్టీ టై అప్‌ ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తరఫున రుణాలను ఆఫర్‌ చేయనుంది. అలాగే, బీమా ఉత్పత్తులను అందించేందుకు బజాజ్‌ అలియెంజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు సేవలను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 650 శాఖల్లో ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘‘1.55 లక్షల తపాలా శాఖలు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో(ఐపీపీబీ) అనుసంధానం అవుతాయి.

గ్రామీణ ప్రాంతాల్లో 1.3 లక్షల తపాలా కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు సేవలు అందుతాయి’’ అని ఆ వర్గాలు తెలియజేశాయి. పేమెంట్స్‌ బ్యాంకులు రూ.లక్ష వరకు డిపాజిట్లను సేకరించొచ్చు. ఇతర బ్యాంకుల ఖాతాలకు నగదు బదిలీ సేవలను అందించవచ్చు. కానీ రుణాలు, క్రెడిట్‌ కార్డు సేవలను అందించేందుకు అనుమతి లేదు. మూడో పక్షంతో ఒప్పందం చేసుకుని వాటి తరఫున ఇతర ఆర్థిక సేవలను అందించొచ్చు. 

పోస్ట్‌మ్యాన్‌ పేరు ‘పోస్ట్‌ పర్సన్‌’: పోస్ట్‌మ్యాన్‌ను పోస్ట్‌ పర్సన్‌గా మార్చే ప్రతిపాదను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లింగపరమైన సమానత్వం కోసం పోస్ట్‌మ్యాన్‌కు బదులుగా పోస్ట్‌పర్సన్‌ అని పిల వాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్‌ చేసిన సిఫారసే ఇందుకు మూలం. పోస్ట్‌ ఉమన్‌ కూడా పనిచేస్తున్నందున పోస్ట్‌ పర్సన్‌ అని పిలవడమే సముచితమని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement