అచ్చం అమ్మలాగే ఇషా అంబానీ

Isha Ambani Balancing MBA classes And Also Teaching - Sakshi

ముంబై : రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలికాం మార్కెట్లో జియో సంచలనాలు సృష్టిస్తున్న దగ్గర్నుంచి ఇషా అంబానీ పేరు మారుమ్రోగుతోంది. జియో ఐడియా తన కూతురిదేనని పలుమార్లు ముఖేష్‌ పలు వేదికలపై వెల్లడించారు కూడా. రిలయన్స్‌ జియో డైరెక్టర్‌గా ఇషా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె పోలికలు మాత్రం అచ్చం తల్లి నీతా అంబానీ లాంటివేనట. తన తల్లి కోరిక మేరకు అటు చదువును, ఇటు ఉద్యోగాన్ని ఆమె ఎంతో విజయవంతంగా బ్యాలెన్స్‌ చేసుకుంటున్నారని తెలిసింది.

ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న నీతా, ఇషా యేల్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిందని, ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేస్తున్నట్టు తెలిపారు. అటు ఎంబీఏ క్లాసెస్‌కు హాజరు అవుతూనే, బింగ్‌ అనే స్టాన్‌ఫోర్డ్‌ నర్సరీలో ఉద్యోగం చేస్తున్నట్టు నీతా వెల్లడించారు. అక్కడ తాను టీచర్‌గా వర్క్‌ చేయనున్నట్టు తెలిపారు. నీతా అంబానీ కూడా ముఖేష్‌ అంబానీని కలిసినప్పుడు స్కూల్‌ టీచర్‌గానే పనిచేసేవారు. రిలయన్స్‌ జియోలో డైరెక్టర్‌ హోదా, స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ, నర్సరీలో ఉద్యోగం అన్నింటిన్నీ విజయవంతంగా చేపడుతున్నట్టు తెలిసింది. దీంతో అచ్చం అమ్మలాగే, కూతురు అంటూ పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top