
300 పట్టణాల్లో తొలిసారిగా ఐడియా 4జీ
టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులార్ 4జీ సేవల రంగంలో భారీ ప్రణాళికలు వేస్తోంది. దేశవ్యాప్తంగా 100 రోజుల్లో 10 సర్కిళ్ల పరిధిలోని 575 పట్టణాల్లో కంపెనీ 4జీ సేవల్ని..
♦ జూన్ నాటికి మరో 100 కేంద్రాల్లో
♦ ఐడియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ రజత్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులార్ 4జీ సేవల రంగంలో భారీ ప్రణాళికలు వేస్తోంది. దేశవ్యాప్తంగా 100 రోజుల్లో 10 సర్కిళ్ల పరిధిలోని 575 పట్టణాల్లో కంపెనీ 4జీ సేవల్ని ఆరంభించింది. ఇందులో 300 కేంద్రాల్లో తొలిసారి 4జీ సర్వీసులను పరిచయం చేస్తున్నది ఐడియానే కావటం గమనార్హం. మూడు నెలల్లో మరో 100 పట్టణాల్లో మొదటిసారిగా ఐడియా 4జీ సేవలను ఆరంభించవచ్చని అంచనా వేస్తున్నట్టు కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల ప్రధాన అధికారి రజత్ ముఖర్జీ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీవోవో టి.జి.బి.రామకృష్ణతో కలిసి గురువారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 121 పట్టణాలకుగాను 102 చోట్ల మొదటిసారిగా 4జీ సర్వీసులను తామే ప్రారంభించామని చెప్పారు. జూన్ నాటికి మొత్తం 750 పట్టణాలకు 4జీని విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం.
ధర ఒక్కటే కాదు..
ఐడియా 10 సర్కిళ్లలో 14,500కుపైగా 4జీ టవర్లను నెలకొల్పింది. ఇందులో 2,250 సైట్లు ఒక్క ఏపీ సర్కిల్లోనే ఉన్నాయి. 4జీ మొబైల్ కస్టమర్ల సంఖ్యను బట్టి ఒక్కో పట్టణంలో సేవలను విస్తరిస్తున్నట్టు రజత్ తెలిపారు. ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే చార్జీలు ఒక అంశం మాత్రమేనని అన్నారు. అనుభూతి, కంటెంట్, కవరేజ్ తదితర అంశాలూ కీలకమేనన్నారు. ఈ ఏడాది చివరికల్లా హ్యాండ్సెట్లు రూ.4 వేల నుంచి లభించడం ఖాయమన్నారు. ఇక కంపెనీకి నాన్ వాయిస్ ఆదాయం 2014లో 15 శాతం ఉంటే, ఏడాదిలోనే ఇది 20 శాతానికి చేరింది. 2016లో నాన్ వాయిస్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని కంపెనీ భావిస్తోంది. డేటా వినియోగం అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని చెబుతోంది.