ముఖేష్ అంబానీకి షాక్‌!

Indian Government Trying To Stop Selling Reliance Assets To Aramco - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌-సౌదీ ఆరామ్‌కో డీల్‌కు అడ్డుకట్టవేయనున్న ప్రభుత్వం?

ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానికి షాక్‌ తగలనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్‌కోకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రిలయన్స్‌ వ్యాపారంలోని 25 శాతం వాటాను ఆరామ్‌కో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వం అడ్డుకున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వార్తను ప్రచురించింది. 

కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ గ్యాస్‌పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. గతంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్‌కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిరాకరించింది. మార్కెట్‌ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top