
ఫ్లిప్కార్ట్ పెట్టుబడుల విలువను సగానికి తగ్గించిన ఫిడెలిటీ
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ, ఫ్లిప్కార్ట్లో తన పెట్టుబడుల విలువను అమెరికాకు చెందిన మ్యూచువల్ ఫండ్ ఫిడెలిటీ రట్లాండ్ స్క్వేర్ ట్రస్ట్ టూ సగానికి పైగా తగ్గించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ, ఫ్లిప్కార్ట్లో తన పెట్టుబడుల విలువను అమెరికాకు చెందిన మ్యూచువల్ ఫండ్ ఫిడెలిటీ రట్లాండ్ స్క్వేర్ ట్రస్ట్ టూ సగానికి పైగా తగ్గించింది. ఫ్లిప్కార్ట్లో ఒక శాతం కంటే తక్కువగా(52,096 షేర్లు) ఫెడిలిటీకి వాటా ఉంది. ఈ షేర్ల విలువ గత ఏడాది నవంబర్ 30న 54 లక్షల డాలర్లుగా(ఒక్కో షేర్ విలువ 104 డాలర్లుగా) ఫిడెలిటీ అమెరికా నియంత్రణ సంస్థలకు నివేదించింది.
ఇక ఈ నెల 24న నియంత్రణ సంస్థలకు వెల్లడించిన సమాచారంలో ఈ విలువను 27 లక్షల డాలర్లుగా(ఒక్కో షేర్ విలువ 52 డాలర్లని) ఫిడెలిటీ పేర్కొంది. కాగా ఈ విషయమై ఫ్లిప్కార్ట్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.మరోవైపు ఆన్లైన్ దిగ్గజం అమెజాన్లో పెట్టుబడులను 13% పెంచుకున్నట్లు ఫిడెలిటీ పేర్కొంది. ఇప్పుడు తమకు అమెజాన్లో 2,81,493 షేర్లు ఉన్నాయని, వీటి విలువ 21.12 కోట్ల డాలర్లని (ఒక్కో షేర్ విలువ 750 డాలర్లు) వివరించింది.