జియో నుంచి ఎంట్రిలెవల్ 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు | Entry-level 4G/5G phones with Google | Sakshi
Sakshi News home page

జియో నుంచి ఎంట్రిలెవల్ 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు

Jul 15 2020 4:36 PM | Updated on Jul 15 2020 5:14 PM

Entry-level 4G/5G phones with Google - Sakshi

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తెలిపారు. నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (ఏజీఎం)లో ముకేశ్‌ మాట్లాడుతూ ‘‘జియో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిబద్దతను కలిగి ఉంది. ఈరోజు వరకు 10 కోట్ల జియోఫోన్లను విక్రయించాము. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో ఎంట్రీ లెవల్‌ 4జీ, 5జీ ఫోన్లను తయారీ చేయగలమని నమ్ముతున్నాం’’ అని తెలిపారు. ఇప్పటికీ 35కోట్ల మంది 2జీ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తారని, వారి దృష్టిలో ఉంచుకొని చౌకధరల్లో స్మార్ట్‌ఫోన్‌ తయారీకి సిద్ధమైనట్లు ముకేశ్‌ ఈ సందర్భంగా తెలిపారు. జియో, గూగుల్‌ సంయుక్త భాగస్వామ్యంలో తయారీ అయ్యే 4జీ, 5జీ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌.... ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్‌ను ఆప్టిమైజ్‌ చేసుకోనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

స్మార్ట్‌ ఫోన్‌ తయారీ అంశంపై గూగుల్‌ స్పందిస్తూ ...‘‘ 50కోట్ల భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి రూపొందించిన టెక్నాలజీ, నెట్‌వర్క్‌ ప్రణాళికల్లో మార్పులను చూడటం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఇప్పటికీ చాలామందికి ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. చాలా తక్కువమంది స్మార్ట్‌ఫోన్‌ వినియోదిస్తున్నారు. ఇకపై టెక్నాలజీలతో పాటు డివైజ్‌లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది’’ అని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement