ఆయిల్‌ మాత్రమే కాదు ..కొత్త సాయిల్‌ కూడా డేటానే | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ మాత్రమే కాదు ..కొత్త సాయిల్‌ కూడా డేటానే

Published Fri, Dec 1 2017 8:33 PM

Data is not only new oil, but also new soil: Mukesh Ambani - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ టెలికాం పరిశ్రమ నష్టాలకు జియోను నిందించొద్దని ప్రముఖ వ్యాపారవేత్త ,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.  భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ తనకు  ప్రత్యర్థి కాదని,  స్నేహితుడని ప్రకటించారు.  వ్యాపారంలో సాహసాల ఫలితంగానే లాభనష్టాలు వస్తాయని.. ఏది ఏమైనా కస్టమర్లు ప్రధానమని చెప్పుకొచ్చారు. దేశం పురోగతి చెందుతుందా, వినియోగదారుడికి ప్రయోజనం కలుగుతుందా అనేదే కీలకమన్నారు.

హెచ్‌టీ  లీడర్షిప్ సమ్మిట్ 2017 లో ముకేష్ అంబానీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  భారతదేశంలో 'డిజిటల్ హరిత విప్లవం'  రావాలన్నారు. ఈ నేపథ్యంలో 58,000 కళాశాలలు, 700 విశ్వవిద్యాలయాలు , 19 లక్షల పాఠశాలలు డిజిటల్‌గా అనుసంధానంకానున్నాయన్నారు.   దేశంలో జియో  ఎంట్రీతో  డేటా సేవల స్వరూపమే మారిపోయిందన్నారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌  మార్కెట్‌లో గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్‌ ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగిందని ఆయన వెల్లడించారు. ఇపుడు దేశానికి ఆయిల్‌ సాయిల్‌ డేటా  అని చెప్పారు.  అలాగేతన మిత్రుడు నందన్‌నీలేకని  సృష్టించిన బయోమెట్రిక్‌ ఆధార్‌  ప్రపంచంలోనే అత్యంత భద్రమైన వ్యవస్థగా నిలిచిందని  ప్రశంసించారు.

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని ముఖేశ్‌ అంబానీ అన్నారు. 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపై 5 ట్రిలియన్‌ డాలర్లను చేరుకుంటుందన్నారు. ‘2004లో భారత ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వచ్చే 20ఏళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అప్పుడే తాను అంచనా వేశాననీ,  ప్రస్తుత ప్రగతి చూస్తుంటే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని భారత్‌ చేరుకుంటుంది.వచ్చే పదేళ్లలో 7 ట్రిలియన్‌ డాలర్లకు  కచ్చితంగా చేరగలం మనీ.. 2030 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల సమీపానికి ఎదుగుతామని అంబానీ వెల్లడించారు.  

Advertisement
Advertisement