భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు | Currency notes circulation increased 6.2 Percent in 2019 says RBI Annual Report | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు

Aug 29 2019 8:45 PM | Updated on Aug 29 2019 8:54 PM

 Currency notes circulation increased 6.2 Percent in 2019 says RBI Annual Report - Sakshi

సాక్షి, ముంబై: రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా  తన వార్షికనివేదికలను గురువారం ప్రకటించింది.  పెద్ద నోట్ల రద్దుతరువాత డిజిటల్‌  లావాదేవీకు కేంద్రం భారీ ప్రోత్సాహాన్నిస్తుండగా ఆర్‌బీఐ షాకింగ్‌  న్యూస్‌ చెప్పింది.  2018-19లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల పరిమాణం 6.2 శాతం పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 108,759 మిలియన్ కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 500 రూపాయల  నోట్ల చలామణి గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరంలో 42.9 శాతం  నుంచి 51.0 శాతానికి పెరిగిందని నివేదిక తెలిపింది.  దీంతో పాటు రూ.500, రూ.2వేల  నకిలీ నోట్ల చలామని కూడా భారీగా పెరగడం గమనార్హం. దీంతో నరేంద్రమోదీ సర్కార్‌ కల డిజిటల్‌ ఎకానమీ కలకు చెక్‌పడింది.

2018-19లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 17 శాతం పెరిగి రూ .211.11 లక్షల కోట్లకు చేరుకుంది. విలువ పరంగా, 2019 మార్చి చివరి నాటికి రూ .500,  రూ .2,000 నోట్ల వాటా 82.2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో,  మొత్తం నోట్ల విలువలో వీటి వాటా  80.2 శాతంగా  ఉంది. 2019 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో  వాల్యూమ్ పరంగా, రూ .10 ,  రూ .100 నోట్లు 47.2 శాతంగా ఉంది.  2018 మార్చి చివరి నాటికి ఇది 51.6 శాతంగా నమోదైంది. 

గత సంవత్సరం 2.4 శాతం పెరుగుదలతో పోలిస్తే 2018-19లో చెలామణిలో ఉన్న నాణేల మొత్తం విలువ 0.8 శాతం పెరిగింది. అంతకుముందు సంవత్సరంలో 2.4 శాతం పెరుగుదలతో పోలిస్తే మొత్తం వాల్యూమ్ 1.1 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగింపులో రూ.1, రూ .2,  రూ .5 నాణేలు మొత్తం చెలామణిలో ఉన్న నాణేల పరిమాణంలో 83.6 శాతం ఉన్నాయి. విలువ పరంగా వీటి వాటా 78.3 శాతం.

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, రూ .10, రూ .20, రూ .50 అనే డినామినేషన్లలో వరుసగా 20.2 శాతం, 87.2 శాతం, 57.3 శాతం నకిలీ నోట్లు పెరిగాయి. అయితే రూ.100ల నకిలీ నోట్లు మాత్రం 7.5 శాతం తగ్గాయి. ఆగస్టు 2017లో ప్రవేశపెట్టిన రూ .200 నోట్లలో  అంతకుముందు సంవత్సరంలో 79 పోలిస్తే... 12,728 నకిలీ నోట్లను గుర్తించినట్టు ఆర్‌బీఐ నివేదించింది. అలాగే  ఈ  ఏడాది రూ .500ల (కొత్త డిజైన్ నోట్స్) నకిలీ నోట్లు 121.0 శాతం పెరగ్గా,  రూ. 2వేల నోట్లలో నకిలీవి  21.9 శాతం పెరిగిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.

బ్యాంకు కుంభకోణాలు  : 2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాల మొత్తం విలువ  74 శాతం ఎగిసి రూ. 72వేల కోట్లుగా ఉంది.  ఇందులో ప్రభుత్వ బ్యాంకులది 90 శాతం వాటా.

Advertisement
 
Advertisement
Advertisement