ఎస్బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి
బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాసులు శెట్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో... మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్ ఎస్బీఐలో ప్రొబెషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసులుకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టే ఆయన హైదరాబాద్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. ఆ తరవాత అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టి అక్కడే స్థిరపడ్డారు. ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీనివాసులు... వృత్తి రీత్యా గతంలో కొన్నాళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.