పీఎన్‌బీ స్కాం: ఆర్‌బీఐకు సీబీఐ సెగ | CBI questions a former deputy governor of RBI | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం: ఆర్‌బీఐకు సీబీఐ సెగ

Apr 6 2018 5:26 PM | Updated on Apr 6 2018 5:49 PM

 CBI questions a former deputy governor of RBI - Sakshi

సీబీఐ కార్యాలయం( ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసు ఆర్‌బీఐ మెడకు బాగానే చుట్టుకున‍్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే  కేంద్ర బ్యాంకు ప్రాతపై  ఆరా తీస్తున్న సీబీఐ  మరింత వేగం పెంచింది. తాజాగా  స్కాం చోటుచేసుకున్న కాలం నాటి  అధికారులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్‌ను శుక్రవారం  ప్రశ్నించింది. దాదాపు రూ.13,500 కోట్ల మేర  పీఎన్‌బీ భారీ కుంభకోణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్‌బీఐ సరియైన ఆడిట్‌ చేపట్టలేకపోవడమేనని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి ఆరోపించిన నేపథ్యంలో సీబీఐ మరింత చురుకుగా కదులుతోంది. ఈ నేపథ్యంలో తాజా చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆ అధికారి పేరు మాత్రం వెల్లడి కానప్పటికీ 2011-16 కాలంలో ఆయన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న హెచ్‌ ఆర్‌ ఖాన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పీఎన్‌బీ స్కాం విషయంలో తొలిసారి ఆర్‌బీఐ అధికారులను కూడా ఇప్పటికే విచారించింది సీబీఐ . ఆర్‌బీఐకు చెందిన నలుగురు సీనియర్‌ ఆర్‌బీఐ అధికారులను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. నలుగురు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ల్లో ముగ్గురు చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు, ఒకరు జనరల్‌ మేనేజర్‌ ఉన్నారు. మోదీ, చౌక్సిలకు జారీచేసిన లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎల్‌ఓయూ) జారీచేయడం విషయం సెంట్రల్‌ బ్యాంకుకు తెలుసా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్‌ఓయూ జారీ ప్రక్రియలో ఆడిటింగ్‌పై కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది.  అదేవిధంగా నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సి సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న 80:20 గోల్డ్‌ ఇంపోర్ట్‌ స్కీమ్‌పై కూడా సీబీఐ విచారిస్తోంది. ఈ స్కీమ్‌ చౌక్సి, మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement