తయారీలో అగ్రగామిగా మారతాం | Become the pioneer of manufacturing | Sakshi
Sakshi News home page

తయారీలో అగ్రగామిగా మారతాం

Jan 30 2018 1:23 AM | Updated on Jan 30 2018 9:43 AM

Become the pioneer of manufacturing - Sakshi

కేటీఆర్‌తో ఆర్‌ఈసీ, టి–హబ్‌తోపాటు ఇతర సంస్థల ప్రతినిధులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తయారీ రంగంలో అగ్రగామిగా మారతామన్న విశ్వాసం తమకుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. 2017–18 ఎకనమిక్‌ సర్వే ప్రకారం తయారీలో టాప్‌–5 రాష్ట్రాల్లో తెలంగాణకు చోటు దక్కటం తెలిసిందే. దేశం నుంచి తయారీ ఎగుమతుల్లో 70 శాతం ఈ అయిదు రాష్ట్రాలే కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదన్నారు.

టీఎస్‌–ఐపాస్‌ మూలంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, తయారీ పెరగడం వల్లే తొలి అయిదు స్థానాల్లో తెలంగాణ చేరిందని గుర్తు చేశారు. మున్ముందు ఇదే ఒరవడి కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో విద్యుత్‌ మిగులు స్థాయికి రావడం, పారదర్శక పారిశ్రామిక విధానాలు, అవినీతికి తావులేకుండా అనుమతులివ్వడం వంటి చర్యలతో ఈ స్థాయిలో పురోగతి సాధించామన్నారు.

పరిష్కారాల వేదిక టి–హబ్‌..
టి–హబ్‌తో రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారు. సోమవారమిక్కడ కేటీఆర్‌ సమక్షంలో ఆర్‌ఈసీ సీఎండీ పి.వి.రమేష్, టి–హబ్‌ సీఈవో జయ్‌ కృష్ణ ఒప్పందం చేసుకున్నారు. కార్పొరేట్‌ కంపెనీల సమస్యలకు పరిష్కారాలను అందించే వేదికగా టి–హబ్‌ నిలుస్తుందని కేటీఆర్‌ ఈ సందర్భంగా అన్నారు.

‘దావోస్‌ సదస్సులో బీర్ల తయారీ కంపెనీ కారŠల్స్‌బర్గ్‌ సీఈవో నన్ను కలిశారు. ఒక లీటరు బీరు తయారీకి 3.8 లీటర్ల మంచి నీరు వాడుతున్నామని, నీటిని మరింత ఆదా చేయగలికే టెక్నాలజీ అందించేందుకు సాయపడాలని కోరారు. త్వరలోనే ఆ కంపెనీ టి–హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది’ అని మంత్రి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement