‘చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ | ysrcp leader botsa satyanarayana takes on chandrababu naidu over kapu reservations | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’

Aug 7 2017 5:39 PM | Updated on Sep 17 2017 5:16 PM

‘చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’

‘చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’

చంద్రబాబు నాయుడుపై నంద్యాల సభలో వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సమర్ధించారు.

కాకినాడ: నియంతృత్వ పోకడలకు పోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నంద్యాల సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సమర్ధించారు. వైఎస్‌ జగన్‌ ప్రజల బాధను వ్యక్త పరిచారని, బాబుపై ఆయన చేసిన వ్యాఖ్యల్లోని భావం ముఖ్యమని పేర్కొన్నారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సునీల్‌ తదితరులు సోమవారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఈ మేరకు ఆయన తలపెట్టిన పాదయాత్రకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు  మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజమండ్రిలో చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి వంచించారన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు గొప్ప కోసం 29 మంది అమాయకులు ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. ఆ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా ప్రజలు మరిచిపోలేదని,  రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం వేసిన విచారణలో ఏం తేలిందని బొత్స ఈ సందర్భంగా నిలదీశారు. చంద్రబాబు ఇంటింటికి తిరిగి కాపులను బీసీ జాబితాలో చేర్చుతామన్నారన్న విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీనే ముద్రగడ అడుగుతున్నారని, చంద్రబాబు చేస్తున్న పని కాపు జాతికి అవమానకరమన్నారు. ఇచ్చిన హామీ కోసం ముద్రగడ పాదయాత్ర చేస్తామంటే ఇంటికో పోలీసును పెట్టి ఉద్యమాన్ని అణచివేస్తారా? అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు.  దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement