
సాక్షి, విశాఖపట్నం: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడిపే వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పేరుతో వారి జీవితాల్లో వెలుగులు నింపే పథకంలో అత్యధిక మంది లబ్ధిదారులను గుర్తించిన జిల్లాగా విశాఖ నంబర్ వన్లో నిలవగా.. అర్బన్ విభాగంలో జీవీఎంసీ ప్రథమ స్థానంలో ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం జీవితాల్లో వెలుగుపూలు పూస్తున్నాయి. ప్రతి వర్గానికి చెందిన కార్మికుడికీ ఆర్థిక భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ వాహన మిత్ర పథకం’ ప్రవేశపెట్టారు. ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు, ట్యాక్సీలు కొనుగోలు చేసి వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు మేలు చేసేందుకు వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబర్ 14 నుంచి 25 వరకూ నిర్వహించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించారు. ఆధార్కార్డు, తెల్ల రేషన్కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్ వివరాలను అందించిన వారిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో అసలైన లబ్ధిదారులను గుర్తించిన జిల్లాల్లో విశాఖపట్నం రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అదే సమయంలో జీవీఎంసీ అత్యధిక మంది లబ్ధిదారులను గుర్తించి అర్బన్ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది.
అత్యధికంగా జీవీఎంసీ పరిధిలోనే..
రాష్ట్ర వ్యాప్తంగా 1,75,345 దరఖాస్తులు రాగా 1,73,180 దరఖాస్తుదారులను లబ్ధిదారులుగా గుర్తించారు. విశాఖ జిల్లాలో 24,636 మంది దరఖాస్తు చేసుకోగా 24,527 దరఖాస్తులను ఆమోదించారు. అత్యధికంగా లబ్ధిదారులను గుర్తించిన జిల్లాగా విశాఖ జిల్లా నిలిచింది. ఇక నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వచ్చిన దరఖాస్తుల సంఖ్యలో జీవీఎంసీ ప్రథమ స్థానంలో ఉంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా 24,527 మంది లబ్ధిదారులుగా గుర్తించగా.. ఇందులో జీవీఎంసీ పరిధిలోనే 11,477 మంది వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి అర్హులుగా నిర్థరించారు.
ఆర్థిక సహాయంతో చేయూత
వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ సజావుగా సాగింది. రాష్ట్రంలో జీవీఎంసీ నంబర్ వన్గా నిలిచింది. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తుల ను స్వీకరించి.. పరిశీలన అనంతరం లబ్ధిదారులను గుర్తిం చాం. డ్రైవర్లకు అందిస్తున్న ఆర్థిక సహాయం, వాహన ఇన్సూరెన్స్, వెహికల్ ఫిట్నెస్, మరమ్మతులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయి.– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్