చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు: వైఎస్ జగన్ | YS Jagan mohan reddy's press meet | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు: వైఎస్ జగన్

Dec 4 2014 5:12 PM | Updated on Jul 25 2018 4:07 PM

చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు: వైఎస్ జగన్ - Sakshi

చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు: వైఎస్ జగన్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ..ఎన్నికలు అయిన తర్వాత ప్రజలతో పనిలేదనుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ..ఎన్నికలు అయిన తర్వాత ప్రజలతో పనిలేదనుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు అయిన తర్వాత బాబు ప్లేటు ఫిరాయించారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ .... అయిదేళ్ల పాటు ప్రజలతో పనిలేదన్నప్పుడు చంద్రబాబు ఎలా ప్లేటు మార్చేయగలిగారో, ఎంతగొప్పగా అబద్దాలు ఆడారో...మీడియాకు విజువల్స్ ద్వారా చూపించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ' మొట్టమొదటిగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన దాంట్లో ప్రధానపాత్ర చంద్రబాబు నాయుడిదే. పార్లమెంటులో తన ఎంపీల చేత తానే ఓటు వేయించిన ఘటన బాబుది. సీమాంధ్రకు, తెలంగాణకు చంద్రబాబు వేర్వేరుగా మేనిఫెస్టోలు ప్రకటించారు. తన మేనిఫెస్టోలో తానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అని ప్రకటించారు. చంద్రబాబు నాయుడి గెజిట్ పేపర్ ఈనాడు దినపత్రికలో వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అని రాశారు.

 ఏప్రిల్ 11న చంద్రబాబు ఈసీకి రాసిన లేఖలో రెండో లైన్లోనే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆరోజు ఆయన అన్నది పంట రుణాలు కాదు, వ్యవసాయ రుణాలే. ప్రధాని మోదీగారితో కలిసి చంద్రబాబు పక్కనే ఉన్న కరపత్రాలు చాలా విడుదల చేశారు. ఇందులో మొట్టమొదటి పాయింటే..వ్యవసాయ రుణాల మాఫీ. ఇక రెండోది డ్వాక్రా రుణాల మాఫీ. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు..గెజిట్ పేపర్ ఈనాడు పత్రికలో వ్యవసాయ రుణాలు రద్దు అంటూ పెద్ద ప్రకటన ఇచ్చారు.

2014 మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. నేనెప్పుడు అన్నాను..వ్యవసాయ రుణాలని.. నేను అన్నది పంట రుణాలు అని చంద్రబాబు ప్లేటు మార్చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ సంగతి అడిగితే తర్వాత మాట్లాడదాం దాని గురించి అని మాట మార్చేశారు. బాబొస్తాడు..జాబు వస్తుంది.. అని విస్తృతంగా ప్రచారం చేశారు. ఒకవేళ జాబు రాకపోతే..రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబు వచ్చాడు..జాబు రాలేదు...కనీసం నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారంటే దాని గురించి మాట్లాడరు' అని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం చేపట్టబోయే మహాధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement