
సాక్షి ప్రతినిధి కడప: కడపలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో సమరశంఖారావం చేపట్టనున్నారు. మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఆ మేరకు కడపలో గురువారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో రానున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 11 గంటలకు గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మ. 1 గంటకు బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో మున్సిపల్ స్టేడియంలో సభ ఏర్పాటు చేశారు.
బూత్ కమిటీ సభ్యులతో సంభాషించేలా నాలుగు వైపులా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఇది వరకు ఏ బహిరంగ సభలకూ లేని విధంగా ఈ సభకు ఇలాంటి ప్రత్యేక సదుపాయం కల్పించారు. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2,500 మంది చొప్పున 25 వేల మందికి ఏర్పాట్లు చేశారు. సభా వేదికతోపాటు, ప్రాంగణాన్నంతా వైఎస్సార్సీపీ జెండాలోని ఆకుపచ్చ, తెలుపు, నీలివర్ణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాగా, కడప ఎమ్మెల్యే అంజద్బాషా, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.