ముగిసిన వృద్ధులు, వితంతువుల దీక్షలు | Widow and senior citizens strikes end, for the demand of pension | Sakshi
Sakshi News home page

ముగిసిన వృద్ధులు, వితంతువుల దీక్షలు

Oct 9 2013 7:19 AM | Updated on Sep 1 2017 11:29 PM

పింఛన్ రూ.వెయ్యికి పెంచాలని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద వృద్ధులు, వితంతువులు చేపట్టిన దీక్షలు మంగళవారం ముగిసాయి.

 పింఛన్ రూ.వెయ్యికి పెంచాలని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద వృద్ధులు, వితంతువులు చేపట్టిన దీక్షలు మంగళవారం ముగిసాయి. రిలే దీక్షలు మంగళవారం నాటికి వంద రోజులు పూర్తయ్యాయి. ముగింపు సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు వృద్ధులు, వితంతువులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు రేగుంట కేశవరావు మాదిగ మాట్లాడుతూ వృద్ధులు, వితంతువుల పింఛన్ రూ.వెయ్యికి పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వంద రోజులు రిలే దీక్షలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.
 
ఇతర రాష్ట్రాల్లో వృద్ధులకు చెల్లిస్తున్నట్లుగానే ఇక్కడా పింఛన్ పెంచాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై ఉన్న శ్రద్ధ వృద్ధులు, వితంతువుల పింఛన్‌పై లేదని విమర్శించారు. అనంతరం తహశీల్దార్ సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఇప్ప దాసు, నాగరాజు, సాగర్, రాజేశ్వర్, వృద్ధుల సంఘం అధ్యక్షురాలు సోమ గుండమ్మ, వితంతువుల సంఘం అధ్యక్షురాలు రాపర్తి ప్రేమల, వృద్ధులు, వితంతువులు పాల్గొన్నారు. కాగా, వృద్ధులు, వితంతువుల ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రి సత్యనారాయణ, జేఏసీ కన్వీనర్ గంధం శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి చెర్ల మురళి మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement