సీమాంధ్ర టీచర్లకు బదిలీలు? | transfers to seemandra teachers | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర టీచర్లకు బదిలీలు?

Nov 10 2013 4:11 AM | Updated on Sep 2 2017 12:28 AM

ఎట్టకేలకు 610 జీఓపై కదలిక వచ్చింది. ఈ జీఓ అమలు పై రెండు రోజుల క్రితం విద్యాశాఖ ఉన్నత స్థాయిలో చర్చించి బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది

 కంఠేశ్వర్, న్యూస్‌లైన్ :  ఎట్టకేలకు 610 జీఓపై కదలిక వచ్చింది. ఈ జీఓ అమలు పై రెండు రోజుల క్రితం విద్యాశాఖ ఉన్నత స్థాయిలో చర్చించి బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర జిల్లాలకు చెందిన వారు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. గతంలో కొంతమంది టీచర్లు సీమాంధ్రకు వెళ్లిపోగా, మరికొందరు కోర్టు స్టేతో ఇక్కడే కొనసాగుతున్నారు. వీరికి ప్రస్తుతం బదిలీలు తప్పడంలేదు .
 జిల్లాలో 58మంది టీచర్లు...?
 జిల్లాలో 2,310 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2.60 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి జిల్లాలో 10వేల మంది టీచర్లు బోధన చేస్తున్నారు. ఇందులో సీమాంధ్ర జిల్లాలకు చెందిన టీచర్లు 127 మంది వరకు ఉండేవారు. వీరిలో బదిలీపై వెళ్లిపోయినవారిని మినహాయిస్తే మరో 58మంది వర కు ఇక్కడే మిగిలిపోయినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నా యి. 2001 సంవత్సరానికి ముందు ఓపెన్ కేటగిరిలో నియమితులైన టీచర్లు 30శాతం కాగా, ఆ తర్వాత ఓపెన్ కేటగిరిలో నియమితులైన టీచర్లు 20 శాతం మందికి బదిలీలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఈ మేరకు బదిలీలు చేపట్టనున్నారు. ఇ దిలా ఉండగా జిల్లాలో 610 జీఓకు విరుద్ధంగా ఎంతమంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారో తదితర వివరాలపై నివేదికను విద్యాశాఖ  ఈ నెల 26 లోపు పాఠశాల డెరైక్టర్‌కు పంపనున్నది.
 ఆదేశాలు అందాయి.
 -రషీద్, ఇన్‌చార్జి డీఈఓ
 610 జీఓపై కోర్టు స్టేతో కొనసాగుతున్న టీచర్ల వివరాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఈ నెల 26 లోపు వివరాలను పంపుతాము. దాని ప్రకారం బదిలీలు జరుగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement