‘ద్విచక్రవాహనంపై వెళుతున్న మమ్ముల్ని గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెంటబడి, వేట కొడవళ్లతో అతిదారుణంగా సర్పంచ్ పులీందర్రెడ్డిని నరికి చంపారు’ అని ప్రత్యక్ష సాక్షి నర్సింహులగూడెం నివాసి పిడమర్తి అబ్రహం శుక్రవారం ‘న్యూస్లైన్’ కు తెలిపారు.
నర్సింహులగూడెం (మునగాల), న్యూస్లైన్: ‘ద్విచక్రవాహనంపై వెళుతున్న మమ్ముల్ని గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెంటబడి, వేట కొడవళ్లతో అతిదారుణంగా సర్పంచ్ పులీందర్రెడ్డిని నరికి చంపారు’ అని ప్రత్యక్ష సాక్షి నర్సింహులగూడెం నివాసి పిడమర్తి అబ్రహం శుక్రవారం ‘న్యూస్లైన్’ కు తెలిపారు. పులీందర్రెడ్డి హత్య ఉదంతాన్ని అబ్రహం పూ సగుచ్చినట్లు వివరించారు. వివరాలు ఆయన మాటల్లో...
గ్రామంలో ఇటీవల నిర్మించిన రూ.8లక్షల సీసీరోడ్డుకు సంబంధించి బిల్లులపై సంతకం కోసం కోదాడ పంచాయతీ రాజ్ కార్యాలయానికి వెళ్లేందుకు నర్సింహులగూడెం నుంచి గురువార ం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరాం. నేను ద్విచక్ర వాహనాన్ని నడుపుతుండగా పులీందర్రెడ్డి వెనుక కూర్చున్నాడు.
కొమరబండ మీదుగా వెళ్లాల్సి ఉండగా..
మార్గమద్యలో పులీందర్రెడ్డికి నాలుగు సార్లు ఫోన్ వచ్చింది. కొమరబండ మీదుగా కోదాడకు వెళ్లాల్సి ఉండగా పులీందర్రెడ్డి బైపాస్ నుంచి వెళదామని చెప్పాడు. ఈలోగా మా వాహనం ముందు నుంచి ఓ ఇండికా కారు నెమ్మదిగా వెళుతుంది. దానిని ఓవర్టేక్ చేశాం. అయితే మా మోటార్బైక్.. స్పీడ్ బ్రేకర్ల వద్దకు రాగానే స్లో చేశాను. ఇంతలో వెనుక ఉన్న కారు ఒక్కసారిగా మా బైక్ను ఢీకొట్టింది.
దీంతో మేమిద్దరం బైక్పై నుంచి చెరొకవైపు పడిపోయాం. మేము తేరుకొని లేచేలోపు కారులోనుంచి ఆరుగురు వ్యక్తులు వేట కొడవళ్లు చేతపట్టుకొని దిగారు. వీరిలో ఐదుగురు ముసుగులు ధరించి ఉన్నారు. ఈ లోగా పులీందర్రెడ్డి నువ్వు పారిపో చంపుతారు అని కేకలు వేసి పరుగు లంకించికున్నాడు. నేను నేరుగా సర్వీస్ రోడ్డు నుంచి బ్రిడ్జిపైకి ఎక్కే ప్రయత్నం చేస్తుండగా ఓ వ్యక్తి నా మీదకు వేటకొడవలి విసిరాడు. కానీ నాకు తగలకుండా తప్పించుకున్నాను. ఈలోగా పారిపోతున్న పులీందర్రెడ్డి వెంట పడ్డారు.
మా ఇద్దరి సెల్ఫోన్లు అక్కడే పడ్డాయి..
మేము కింద పడిన సమయంలో మా ఇద్దరి సెల్ఫోన్లు సంఘటన స్థలం వద్ద పడిపోయాయి. నేను పరిగెత్తుకుంటూ పక్కన పొలంలో నాటు వేస్తున్న కూలీల వద్ద సెల్ఫోన్ తీసుకున్నాను. అందులో బ్యాలెన్స్ లేకపోవడంతో 100, 108నంబర్లకు సమాచారమిచ్చాను. ఆ తర్వాత ఏమీ జరిగిందో నాకు తెలియదు. తీవ్ర భయాందోళనకు గురైన నేను నడుచుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్లో దాక్కున్నాను. దాదాపు గంట తర్వాత తేరుకొని నడుచుకుంటూ హూజుర్నగర్ రోడ్డుపైకి వచ్చి కోదాడ వైపు వెళుతున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి ఎక్కాను. నేరుగా కోదాడలోని సీపీఎం కార్యాలయానికి చేరుకొని కొంతమంది కార్యకర్తలకు జరిగిన విషయాన్ని చెప్పాను. ఈ లోగా పోలీసులు పులీందర్రెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని తెలిసింది.
కొన్ని గంటల్లోనే మిత్రుడిని కోల్పోయి..
కొందరు కార్యకర్తల సాయంతో ఆసుపత్రికి వచ్చి పులీందర్రెడ్డి మృతదేహం చూసేసరికి నాకు గుండె చెదిరింది. అప్పటి వరకు కలిసి ఉన్న ఇద్దరిలో నా మిత్రుడు కొన్ని గంటలలోనే రక్తపు మడుగులో ఉండడంతో నా హృదయం కలచివేసింది. అనంతరం జిల్లా ఎస్పీ రమ్మంటున్నారని నన్ను పోలీసులు తీసుకెళ్లారు. ఆయన అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ఈ సంఘటనలో బైక్ పైనుంచి పడినప్పుడు ఎడమ చేయి, ఎడమ మోకాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీనేను ఆసుపత్రికి వెళ్లకుండా స్వగ్రామం వెళ్లాల్సిందేనని పట్టుబట్టాను. కాగా కొంతమంది నాపై అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ఆరోపణలు కలిచివేశాయి. నేను ప్రాణ ప్రదంగా ప్రేమించే సర్పంచ్, మిత్రుడు పులీందర్రెడ్డి మరణం నేను ఇప్పటీకీ జీర్ణించుకోలేకపోతున్నాను.