డబ్బు కోసం వచ్చి..శవమై.. | The mysterious death of a man of Hyderabad | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం వచ్చి..శవమై..

Nov 30 2014 1:26 AM | Updated on Sep 4 2018 5:07 PM

బాకీ డబ్బుల వసూలు కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.

డబ్బు కోసం వచ్చి..శవమై..
 = కందుకూరు లాడ్జిలో హైదరాబాద్ వ్యక్తి అనుమానాస్పద మృతి
 = మెట్ల నుంచి జారి పడి మృతి చెందాడంటున్న లాడ్జి నిర్వాహకులు
 = మృతదేహం పడి ఉన్న తీరుపై అనుమానాలు
 
కందుకూరు : బాకీ డబ్బుల వసూలు కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఈ సంఘటన స్థానిక పోస్టాఫీసు సెంటర్‌లోని విష్ణుప్రియ లాడ్జిలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్, శ్రీరామ్‌హిల్స్ కాల నీకి చెందిన నరాల లోక్‌నాథం(53)కు వలేటివారిపాలెం మండలం కూనిపాలేనికి చెందిన నవులూరి వెంకటేశ్వర్లు బాకీ ఉన్నాడు. గతంలో వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో కాంట్రాక్టు పనులు చేసే సమయంలో లోక్‌నాథంతో పరిచయమైంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏర్పడ్డాయి. వెంకటేశ్వర్లు నుంచి రావాల్సిన డబ్బుల కోసం లోన్‌నాథం ఈనెల 27వతేదీన కందుకూరు వచ్చాడు. స్థానిక విష్ణుప్రియ లాడ్జిలో దిగాడు. రెండు రోజుల నుంచి వెంకటేశ్వర్లును కలుస్తున్నాడు. ఉన్నట్టుండి లాడ్జి మెట్లపై నుంచి పడ్డాడు. లోక్‌నాథాన్ని స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ప్రశ్నలకు జవాబులేవి?
లోక్‌నాథం మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్వర్లు పలుసార్లు లాడ్జికి వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్లాడు. డబ్బులు చెల్లించే స్థితిలో లేనందున పొలం లోక్‌నాథం పేరుపై రిజిస్ట్రేషన్ చేసేందుకు వెంకటేశ్వర్లు ఆంగీకరించాడు. ఈ మేరకు సోమవారం ఆయన పేరుపై పొలం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఇంతలో లోక్‌నాథం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లాడ్జి సిబ్బంది చెప్తున్న వివరాలకు, జరిగిన సంఘటనకు ఏమాత్రం పోలిక ఉండడం లేదు. మెట్లపై నుంచి జారి పడటం వల్లే లోక్‌నాథం మృతి చెందాడని చెప్తున్నారు. మెట్లు దిగే సమయంలో ఎదురుగా గోడ ఉంది. ఒకవేళ మెట్లు దిగుతూ ముందుకు పడి ఉంటే కచ్చితంగా గోడను ఢీకొనే అవకాశం ఉంది. ఆ క్రమంలో ముఖంపై గాయమై మృతి చెందాలి.

కాని లోక్‌నాథం ముఖంపై చిన్నగాయం కూడా లేదు. మెట్లు దిగుతూ వెనుక్కు పడి ఉంటే మెట్లపై రక్తం మరకలు ఉండాలి. అక్కడ అవేమీ లేవు. తల వెనుక వైపు మాత్రమే బలమైన గాయం ఉంది. మెట్లపై గానీ, ఎదురు గోడకుగానీ ఎటువంటి రక్తపు మరకలు లేవు. మెట్ల కింద భాగంలో ఉన్న ఫ్లోర్‌లో మృతదేహం ఉంది. అక్కడ మాత్రమే రక్తపు మరకలు ఉన్నాయి. పైగా లోన్‌నాథం తీవ్ర గాయాలతో పడి ఉన్నప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్తున్న లాడ్జి సిబ్బంది.. అప్పుడు పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు. నేరుగా ఆస్పత్రికి తీసుకె ళ్లారు. ఆయన చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించిన తర్వాతే లాడ్జి మేనేజర్.. సీఐకి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తేనే లోక్‌నాథం మృతిపై వాస్తవాలు బహిర్గతమవుతాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement