సిమ్‌ కార్డుల్లోనూ ‘రివర్స్‌’ ఆదా | Tenders for village and ward secretariat employees and volunteers sims | Sakshi
Sakshi News home page

సిమ్‌ కార్డుల్లోనూ ‘రివర్స్‌’ ఆదా

Nov 10 2019 4:23 AM | Updated on Nov 10 2019 1:00 PM

Tenders for village and ward secretariat employees and volunteers sims - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విధాన పరమైన నిర్ణయం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రజాధనం భారీగా ఆదా అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు ప్రజలకు సేవలందించేందుకు 4జీ సిమ్‌ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయడంతో రూ.33.77 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. 4జీ సిమ్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ ఓపెన్‌ మార్కెట్‌లో నెలకు రూ.199 ఉండగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కేవలం రూ.92.04కే ఇచ్చేందుకు వీలు కలిగింది. అంటే ఒక్క సిమ్‌ కార్డుపై నెలకు దాదాపు రూ.107 ఆదా అయింది. 4జీ సిమ్‌ కార్డులు 2,64,920 కొనుగోలు చేసేందుకు ఈ నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ఫైనాన్స్‌ బిడ్‌ను ఓపెన్‌ చేసింది.

ఈ టెండర్‌లో 4జీ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ మూడేళ్లకు 2,64,920 సిమ్‌లకు రూ.121.54 కోట్లు కోట్‌ చేసిన ఒక సంస్థ ఎల్‌–1గా నిలించింది. దీనిపై ఏపీటీఎస్‌ ఈ నెల 7వ తేదీన రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ఇదే నియమిత కాలానికి మరో సంస్థ రూ.87.77 కోట్లే కోట్‌ చేసింది. అంటే టెండర్‌ విధానంలో ఎల్‌–1గా నిలిచిన సంస్థ కన్నా రివర్స్‌ టెండరింగ్‌లో మరో సంస్థ రూ.33.77 కోట్లు తక్కువకు కోట్‌ చేసింది. ఈ మొత్తం ప్రజాధనం ఆదా అయినట్లే. ఈ ప్యాకేజీలో జాతీయ, స్థానిక వాయిస్‌ కాల్స్‌కు పరిమితి లేదు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు   1జీబీ డేటా సౌకర్యం ఉంటుంది. కాగా, రివర్స్‌ టెండరింగ్‌ వల్ల 27.8 శాతం.. అదే ఓపెన్‌ మార్కెట్‌ ధరతో పోల్చి చూస్తే ఏకంగా 53.6 శాతం ప్రజాధనం ఆదా అయింది.


Advertisement
 
Advertisement
Advertisement