టీచకుడు! | Teacher molestation on student | Sakshi
Sakshi News home page

టీచకుడు!

Sep 2 2018 9:15 AM | Updated on Nov 9 2018 5:06 PM

Teacher molestation on student - Sakshi

వలేటివారిపాలెం (కందుకూరు అర్బన్‌): విద్యాబుద్ధులు చెప్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. వారం నుంచి ఓ చిన్నారిని లైంగికంగా వేధిస్తూ పైశాచిక అనందం పొందుతున్నాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ విద్యార్థిని లోలోపలే మథనపడుతోంది. ఉపా«ధ్యాయుడి చేష్టలకు భయపడిన చిన్నారి వెనుక బెంచిలో కూర్చుంటుండగా ముందు బెంచిలో కూర్చోవాలని, లేకుంటే పాఠశాలకు కూడా రాలేవని భయపెట్టిన కీచక ఉపాధ్యాయుడి ఉదంతమిది. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

 వివరాలు.. వలేటివారిపాలెం మండలం నేకునాంపురం ప్రాథమిక పాఠశాలలో ఎస్సీ కాలనీకి చెందిన బాలిక ఐదో తరగతి చదువుతోంది. పాఠశాలలో ఉపా«ధ్యాయుడిగా పనిచేస్తున్న ఉన్నం వెంకటేశ్వర్లు అభం శుభం తెలియని చిన్నారిపై కన్నేశాడు. చిన్నారితో ఏ విధంగానైనా కామవాంఛ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. ప్రధానోపాధ్యాయుడు సెలవులో ఉన్నప్పుడు 5వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే  సమయంలో ఆ విద్యార్థినిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. వెనుక బెంచిలో కూర్చొని ఉన్న బాలికను ఉపాధ్యాయుడు తన దగ్గరకు పిలిపించుకొని చెప్పరాని చోట్ల చేతులతో తన ఇష్టం వచ్చినట్లు తాకేవాడు. 

ఉపాధ్యాయుడి వికృత చేష్టలతో విద్యార్థిని హడలి పోయేది. వాస్తవానికి 5వ తరగతి విద్యార్థులకు హెచ్‌ఎం పాఠాలు బోధిస్తారు. ఆమె రెండు రోజులు సెలవు పెట్టడంతో విద్యార్థులు రోజంతా కీచక ఉపాధ్యాయుడి వద్దే కూర్చోవాల్సిన పరిస్థితి. అతడికి అవకాశం రావడంతో సదరు విద్యార్థిని పట్ల వికృత చేష్టలు మొదలు పెట్టాడు. తనకు నచ్చినట్లు నడుచుకోవాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించేవాడని విద్యార్థిని తన తల్లికి చెప్పుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. సెలవులు ముగించుకుని హెచ్‌ఎం పాఠశాలకు రావడంతో కీచక ఉపాధ్యాయుడి వికృత చేష్టలు గురించి గ్రామస్తులు ఆమెకు ఫిర్యాదు చేశారు.

 హెచ్‌ఎం స్పందించి తాజా మాజీ సర్పంచ్‌ను పిలిపించి పాఠశాలలో జరుగుతున్న విషయాన్ని వివరించారు. అంతేకాకుండా ఇన్‌చార్జి ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈఓ రాంబాబు పాఠశాలకు వచ్చి బాధిత విద్యార్థినితో శనివారం మాట్లాడారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ప్రకటించారు.

 గ్రామస్తుల ఆందోళన
కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అతడిని వెంటనే ఆరెస్టు చేసి విధుల నుంచి తొలగించాలని డిమండ్‌ చేశారు. పట్టణ ఎస్‌ఐ వేమన సంఘటన స్థలానికి చేరుకొని బాధిత విద్యార్థినితో ప్రత్యేకంగా మాట్లాడి కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement