విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ | specail focus on study,irrigation : collector | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

Jun 8 2014 1:04 AM | Updated on Jul 11 2019 5:01 PM

విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ - Sakshi

విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: విద్య, వైద్యం, నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. విద్యాసంవత్సరం ఆరంభమైనందున బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించినట్లు తెలిపారు. హాస్టళ్లు కూడా పాఠశాలలతో పాటే పునఃప్రారంభమవుతున్నందున తగిన వసతులు కల్పించుకోవాలని సంక్షేమాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

వర్షాలు పడుతున్నందున అతిసారం, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వైద్యాధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లాపరిషత్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం తనిఖీ చేశారు కదా... ఏమి చర్యలు తీసుకున్నారని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా డీఎంహెచ్‌ఓపై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేశామని, ఇప్పుడిప్పుడే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. బీటీ పత్తి విత్తనాలు అవసరమైనన్నీ ఉన్నాయన్నారు. వర్షాలు సక్రమంగా పడితే వచ్చే నెల చివరిలో ఐఏబీ సమావేశం నిర్వహించి ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు అందించే ఏర్పాటు చేస్తామని వివరించారు. నీటి విడుదలకు ముందు ఉన్న సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను బట్టి తగిన విధంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement