జైలులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌

Skill Development Unit in Prison Says Mekathoti Sucharita - Sakshi

దేశంలోనే తొలిసారిగా కడపలో ఏర్పాటు 

శంకుస్థాపన చేసిన హోంమంత్రి సుచరిత 

కడప అర్బన్‌:  దేశంలోనే తొలిసారిగా కడప కేంద్ర కారాగారంలో రూ.4.70 కోట్ల వ్యయంతో స్కిల్‌డెవలప్‌మెంట్‌ మాడ్యులర్‌ ఫర్నిచర్‌ యూనిట్‌ నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కడప కేంద్ర కారాగారంలో శుక్రవారం ఉదయం ఆమె ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. కేంద్ర కారాగారంలో ఖైదీలతో కాసేపు మాట్లాడారు. మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లో తప్ప మరెక్కడాలేని మాడ్యులర్‌ ఫర్నిచర్‌ యూనిట్‌ను కడప కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఖైదీలలో పరివర్తన కోసం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ యూనిట్‌ నెలకొల్పుతున్నామన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ యూనిట్‌ పూర్తవుతుందన్నారు. ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దిశ యాప్‌ను ప్రారంభించిన 12 రోజుల్లోనే లక్షా 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. ప్రత్యేకంగా కోర్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.87 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు.

స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా మాజీ సీఎం చంద్రబాబు రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు గురువారం విశాఖ వచ్చారన్నారు. బయట వ్యక్తులెవరూ ఆయన్ను అడ్డుకోలేదని, ప్రజలే అడ్డుకున్నారన్నారు. కడప పోలీస్‌ పేరుతో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ హసన్‌రాజా, జైళ్లశాఖ డీఐజీ వరప్రసాదరావు, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్‌ పాల్గొన్నారు. అంతకుముందు సుచరిత అమీన్‌పీర్‌ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top