వంచించి.. హింసించి.. కడతేర్చారు | Sheikh Nur Jahan died in Qatar country | Sakshi
Sakshi News home page

వంచించి.. హింసించి.. కడతేర్చారు

Jun 7 2015 12:36 AM | Updated on Sep 3 2017 3:19 AM

పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతో ఉపాధి కోసం ఖతార్ దేశానికి వెళ్లిన ఉండి గ్రామానికి చెందిన

ఉండి :పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతో ఉపాధి కోసం ఖతార్ దేశానికి వెళ్లిన ఉండి గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ (45) అక్కడి ఏజెంట్ల అకృత్యానికి బలైంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయూలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నూర్జహాన్ తండ్రి కరీంసాహెబ్, ఆమె పెద్ద అల్లుడు షేక్ బాబ్జీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి గ్రామానికి చెందిన కరీంసాహెబ్ పెద్ద కుమార్తె అయిన షేక్ నూర్జహాన్ (45)ను భీమడోలు మండలం పాతూరుకు చెందిన షేక్ వెంకన్న సాహెబ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధి నిమిత్తం ఆమె గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకుని ఉండి గోరింతోటలో నివాసం ఉంటున్న కొల్లి పద్మ అనే ఏజెంట్‌ను సంప్రదించింది.
 
 ఆమె ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఖతార్ దేశానికి వెళ్లారు. అరుుతే ఏజెంట్ కొల్లి పద్మ నూర్జహాన్‌ను విజిటింగ్ విసాపై ఖతార్ పంపింది. ఈ విషయం తెలియని నూర్జహాన్ ఖతార్‌లో అడుగుపెట్టేసరికి అక్కడి ఏజెంట్లు ఆలీ, లక్ష్మి అనే వారు ఆమెను తీసుకెళ్లి ఓ వ్యభిచార గృహానికి రూ.10 లక్షలకు అమ్మేశారు. అనేక కష్టాలను అనుభవించిన నూర్జహాన్ మే 19న తన పెద్ద అల్లుడు షేక్ బాబ్జీకి ఫోన్ చేసి తనను మోసం చేసిన విషయూన్ని వివరించింది. వ్యభిచారం చేయూలంటూ హింసిస్తున్నారని, ఒప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, తనను ఏదోలా స్వదేశానికి తీసుకెళ్లాలని ప్రాధేయపడింది. పది లక్షలు డబ్బులు చెల్లించి మే 23లోగా తీసుకెళ్లకపోతే చంపేస్తామని చెప్పారని నూర్జహాన్ చెప్పినట్టు షేక్ బాబ్జీ తెలిపారు.
 
 నూర్జహాన్‌ను ఖతార్ పంపించిన ఏజెంట్ కొల్లి పద్మను తాము నిలదీయగా అక్కడ అంతా బాగానే ఉందని, నూర్జహాన్ పని చేసుకుంటుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని పద్మ చెప్పిందని కరీంసాహెబ్, బాబ్జీ తెలిపారు. ఈ విషయంపై నూర్జహాన్ భర్త షేక్ వెంకన్న సాహెబ్ ఉండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తన భార్యను స్వదేశానికి రప్పించాలని కోరారని, అరుునా వారు పట్టించుకోలేదని వారు తెలిపారు. చేసేది లేక ఖతార్‌లో ఉన్న బంధువుల ద్వారా ఇండియన్ ఎంబసీ ఫోన్ నంబర్ సంపాదించి వారికి ఫోన్ చేయగా అక్కడి అధికారులు మరొక ఫోన్ నంబర్ ఇచ్చి వారిని సంప్రదించాలని సూచించారని వారు తెలిపారు. అక్కడికి ఫోన్ చేసి వివరాలు తెలపగా నూర్జహాన్ అనే మహిళ మృతదేహం రెండు రోజుల క్రితం ఖతార్‌లో చంపి రోడ్డుపై పడేశారని, మృతదేహం లభ్యమైందని వారు తెలిపినట్టు కరీంసాహెబ్, షేక్ బాబ్జీ తెలిపారు.
 
 పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా
 నూర్జహాన్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు ఉండి పోలీస్‌స్టేషన్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పోలీసులకు ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే నూర్జహాన్ మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూర్జహాన్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
 
 న్యాయం చేయాలంటూ సెల్ టవరెక్కిన నూర్జహాన్ బంధువు
 తమకు న్యాయం చేయాలంటూ నూర్జహాన్ బంధువు షేక్ మస్తాన్ ఉండిలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలోని సెల్ టవరెక్కాడు. నూర్జహాన్ మరణానికి కారకులైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిన ఆయన న్యాయం అందదని భావించి సెల్ టవరెక్కి పోలీసుల్లో వణుకు పుట్టించారు. పోలీసులు వచ్చి నూర్జహాన్ మృతికి కారణమైన ఏజెంట్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని, ఆమె మృతదేహాన్ని త్వరలోనే రప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు టవర్‌పై నుంచి దిగొచ్చాడు.

Advertisement

పోల్

Advertisement