
నేనేరా పోలీస్..
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఖాకీలు కట్టుతప్పుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీసు శాఖలో కొందరి ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది.
=భూకబ్జాలు.. సెటిల్మెంట్లు
=కొట్టుకోవడం..తిట్టుకోవడం నిత్యకృత్యం
=బజారునపడిన పోలీస్ శాఖ పరువు
=ఉలుకు..పలుకు లేని ఉన్నతాధికారులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఖాకీలు కట్టుతప్పుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీసు శాఖలో కొందరి ప్రవర్తన విమర్శలకు తావి స్తోంది. ఖాకీలే పరస్పరం కొట్టుకోవడం.. తిట్టుకోవడం చేస్తుండడంతో మొత్తం పోలీసు శాఖ అభాసుపాలవుతోంది. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేస్తూ విమర్శలపాలవుతున్న పోలీసులు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. తగాదాల్లో ఒకరి తరఫున మాట్లాడడం ఎందుకనుకుంటున్నారో ఏమోగానీ... పంచాయతీ పెట్టుకున్న ఇద్దరినీ పక్కకు తప్పిస్తూ తమకే అంతా అంటున్నారు.
పోలీస్ హెడ్క్వార్టర్స్కు కూత వేటు దూరంలో కాకతీయ విశ్వ విద్యాలయం పరిధిలోని స్థలాన్ని ఇన్స్పెక్టర్ ఆక్రమిస్తున్నారని వర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసు శాఖ పరువు పూర్తిగా పోరుుంది. భూ కబ్జా ఆరోపణల్లో ఉన్న ఇన్స్పెక్టర్, ఫిర్యాదుపై స్పందించి సంఘటన స్థలానికి వెళ్లిన మరో ఇన్స్పెక్టర్ మధ్య జరిగిన వాగ్వాదం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు వ్యక్తులు భూమి విషయంలో గొడపడితే... పోలీసులకు పండగే. సెటిల్మెంట్ పేరిట దందా సాగిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల ఉదాసీనతతోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఆరోపణలు వచ్చిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే కాకతీయ వర్సిటీ వంటి సంఘటనలు పెరుగుతూనే ఉంటాయి.
కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములను వేరే వ్యక్తి దగ్గర తాను కొనుగోలు చేశానని చెబుతూ సీఐ జానీ నర్సింహలు మంగళవారం చదును చేయించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన విశ్వవిద్యాలయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సీఐ దేవేందర్రెడ్డి అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ ఇద్దరు సీఐల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇలా ఇద్దరు సీఐలు గొడవకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా గొడవ పడిన వారిపై ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చుతోంది.
డీఐజీ ఎం.కాంతారావు, అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు పర్వతగిరి పోలీస్ స్టేషన్ తనిఖీకి వెళ్లినప్పుడు.. పోలీసులకు కేటాయించిన నివాస గృహాల్లో సిబ్బంది నివాసం ఉండకపోవడం అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఈ అంశం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి వరకు వెళ్లింది. డీఐజీపై అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
మామూనూరు పోలీసు విభాగంలో వింత పరిస్థితి నెలకొంది. అక్కడి డీఎస్పీ సురేశ్కు, సీఐ రణధీర్కు అస్సలు పొసగడం లేదు. వీరి మధ్య విబేధాలతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారిలోని రెండు వర్గాలు చెరొక అధికారిని సంప్రదిస్తుండడంతో పిటిషన్లు ఎటూ తెగడం లేదు. ఇవన్నీ తెలిసినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉదయభాస్కర్ అనే ఆర్ఎస్సై వేధింపులను తట్టుకోలేక స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జనగామలో ఇసుక లారీలను పట్టుకున్న సందర్భంలో మామూళ్లలో వాటా కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు గొడవపడి తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు.
ఏటూరునాగారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ స్టేషన్లోని తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఎస్సై వెంకటేశ్వర్లు వేధింపుల కారణంగానే చనిపోయాడని కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది అధికారులు వెల్లడించలేదు. ఇది జరిగిన మర్నాడే కాజీపేటలో.. సెలవు ఇవ్వకపోవడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కారణాలు ఏమైనా ఈ సంఘటనలు కింది స్థాయి పోలీసు సిబ్బంది స్థైర్యం బాగా దెబ్బతీశారుు. ఈ విషయంలోనూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించ లేదు.
జిల్లా కేంద్ర కారాగారంలో ఇద్దరు హోంగార్డులకు సంబంధం లేని విధులు అప్పగించారు. తన మాట వినడం లేదనే కారణంతో జిల్లా జైలు సూపరింటెండెంట్ వీరిద్దరినీ సెల్లో నిర్బంధించారు. సొమ్మసిల్లినా వినకుండా క్రమశిక్షణ పేరుతో పరుగెత్తించారు. దీనిపై బాధితులు పోలీస్ బాస్కు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే.. గత శనివారం అధికారుల సమక్షంలో ఓ ఉన్నతాధికారి తన సిబ్బందిపై చేయి చేసుకున్నారు.