ఇంటికి తాళం వేసి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్లిన ఆమెకు తిరిగొచ్చేసరికి ఇంటి తలుపులు తీసి దర్శనమిచ్చాయి.
విజయవాడ : ఇంటికి తాళం వేసి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్లిన ఆమెకు తిరిగొచ్చేసరికి ఇంటి తలుపులు తీసి దర్శనమిచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన ఆమె అలాగే ఇంట్లోకి వెళ్లేసరికి లోపల దొంగ కనిపించాడు. ఆమెను చూసి వెంటనే అప్రమత్తమైన ఆ దొంగ రెప్పపాటులో ఆమెను బలంగా తోసేసి పారిపోయాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పోస్టాఫీస్ వీధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోస్టాఫీస్ వీధికి చెందిన కృష్ణమాచార్యులు ఇంట్లో గురువారం సాయంత్రం కుటుంబసభ్యులు లేని సమయంలో ఓ దొంగ రెండు గొలుసులు, నాలుగు గాజులు, మూడు ఉంగరాలు దోచుకెళ్లాడు. సరుకులు కొనడానికి వెళ్లిన ఆయన కూతురు ఝాన్సీ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న దొంగ దోచుకుంటున్నాడు. అది గమనించిన ఆమె కేకలు వేసింది. దీంతో దుండగుడు ఆమెను పక్కకు తోసి పారిపోయాడు. ఈ దాడిలో ఆమె తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.