పరిశోధన కేంద్రానికి విభజన సెగ! | Research Centre, Division SEGA! | Sakshi
Sakshi News home page

పరిశోధన కేంద్రానికి విభజన సెగ!

Dec 24 2013 2:33 AM | Updated on Sep 2 2017 1:53 AM

పట్టుగూళ్ల ఉత్పత్తిలో కొత్త వంగడాలను సృష్టిం చేందుకు బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో ఏర్పాటు కానున్న పరిశోధన కేంద్రానికి విభజన సెగ తగిలింది.

=పెండింగ్‌లో హర్సిలీహిల్స్ నివేదిక
 =హిందూపురం నుంచే పరిశోధనలు

 
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: పట్టుగూళ్ల ఉత్పత్తిలో కొత్త వంగడాలను సృష్టిం చేందుకు బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో ఏర్పాటు కానున్న పరిశోధన కేంద్రానికి విభజన సెగ తగిలింది. దీనికి సంబంధించిన ప్రతిపాదిత నివేదిక పెండింగ్ పడింది.   
 
సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీ కొండపై వాతావరణం ప్రత్యేకమైంది. సాధారణ ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. ఇప్పటికే మౌళిక పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం నడిచి మూతపడింది. దీంతో ఇక్కడి భవనాలను స్వాధీనం చేసుకుని కొత్త వంగడాల సృష్టికి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన పట్టు పరిశోధన కేంద్రం (ఏపీఎస్‌ఎస్‌ఆర్‌డీఐ) ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితులను పరిశీలించాక నిర్ణయానికి వచ్చారు.

మల్బరీఆకు ఉత్పత్తి, గుడ్ల తయారీ, ప్రధానంగా పట్టులో కొంత వంగడాలను సృష్టించేందుకు అనువైందిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర పట్టు పరిశ్రమ బోర్డుకు పరిశోధన నివేదికను పంపారు. దీనికి ఆమోదం లభించింది. హర్సిలీహిల్స్‌లో ఇంతవరకు బైవోల్టిన్ పట్టుగుడ్ల ఉత్పత్తి జరిగిం ది. ఇకపై అధిక ఆదాయం, ఎక్కువ ప్రయోజనాలిచ్చే కొత్తరకం పట్టుగుడ్ల ఉత్పత్తికి కృషి చేసే కేంద్రంగా మారబోతుండగా రాష్ట్ర విభజన చర్యలతో దీనికి తాత్కాలిక బ్రేక్ పడింది.

దీని కారణంగా ఇక్కడ చేపట్టదలచిన పరిశోధనలను ప్రస్తుతం హిందూపురంలోనే చేస్తున్నారు. దీనిపై పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డెరైక్టర్ బీజే.శర్మ మాట్లాడుతూ కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతోందన్నారు. అయితే ఏర్పాటు ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement