
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ దిగొచ్చింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ ఆక్వా రైతులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం ఆక్వా రైతులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెదకాపవరంలో ఆక్వా రైతులను కలుసుకున్నారు.
అయితే గిట్టుబాటు ధరలు లేక ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఏపీ సర్కార్ పెంచుతున్న విద్యుత్ ఛార్జీల భారం మోయలేక పోతున్నామంటూ వైఎస్ జగన్కు తమ సమస్యలను ఆక్వా రైతులు వివరించారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. ఆక్వా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో టీడీపీ ప్రభుత్వంలో ఉలికి పాటు వచ్చింది. హుటాహుటిన ఆక్వా రైతులతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జననేత వైఎస్ జగన్ తమకు మద్దతుగా నిలవడంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందంటూ ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.