ఆ చెక్కులూ అనుమతిస్తాం | old checks valid for Allowed | Sakshi
Sakshi News home page

ఆ చెక్కులూ అనుమతిస్తాం

Nov 4 2017 1:16 PM | Updated on May 28 2018 3:04 PM

ఒంగోలు క్రైం: అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులుకు యాజమాన్యం 2015 సంవత్సరంలో ఇచ్చిన చెక్కులను కూడా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల వద్దకు తీసుకురావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో డిపాజిట్‌దారులకు స్పష్టత నిచ్చారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో శుక్రవారం ‘అగ్రిగోల్డ్‌ బాధితులను వీడని కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎస్పీ చెక్కుల విషయంలో డిపాజిట్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 2015లో తేదీల వారీగా ఇచ్చిన చెక్కులు కూడా అనుమతిస్తారని చెప్పారు.

వాటిని జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్‌ సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ కేంద్రాలకు తీసుకొచ్చి పరిశీలింపజేసుకోవాలని, ఆన్‌లౌన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా అగ్రిగోల్డ్‌ వెబ్‌సైట్‌లో ఇంకా నమోదు చేసుకోకుండా ఉన్న వారు, గతంలో నమోదు చేసుకొని పోలీస్‌ స్టేషన్లలో వెరిఫికేషన్‌కు వెళ్లని వారు ఇప్పటికైనా కేంద్రాలకు వెళ్లి వారి పత్రాలను వెరిఫై చేయించుకోవాలన్నారు. డిపాజిట్‌దారులు తమ వద్ద ఉన్న బాండ్లు, రసీదులు, చెక్కులు వంటి ఆధారాలతో వెళ్లి నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement