నీట్‌ రాయాల్సిందే.. | Minister Kamineni to the students of Fatima | Sakshi
Sakshi News home page

నీట్‌ రాయాల్సిందే..

Dec 15 2017 1:40 AM | Updated on Sep 2 2018 5:24 PM

Minister Kamineni to the students of Fatima - Sakshi

సాక్షి, అమరావతి: ఫాతిమా విద్యార్థుల సమస్య చాలా జఠిలమైనదని, కేంద్ర అధికారులు చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పు మేరకు వీళ్లందరూ నీట్‌  రాయాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన బాధిత విద్యార్థులు, కళాశాల యాజమాన్యంతో సచివాలయంలో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పోలవరం, ఆర్థిక లోటుతో పాటు ఫాతిమా విద్యార్థుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు.

ఫాతిమా విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని, అయినా సరే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ ప్రతిపాదననూ భారతీయ వైద్యమండలి అంగీకరించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఫీజులు ఇప్పిస్తామని, దీనిపై యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఫాతిమా బాధిత విద్యార్థులకు పోరంకిలోని నారాయణ కళాశాలలో లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇస్తున్నామని, దీనికి మూడొంతుల మంది విద్యార్థులు అంగీకరించారన్నారు. నీట్‌ పరీక్షలో అర్హత సాధించి సీటొచ్చిన వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, ఇది జరగాలంటే ఫాతిమా నుంచి ఫీజు తీసుకోకూడదని అన్నారు.

ఆర్డినెన్స్‌ తీసుకురావాలి
ఫీజులు అందరికీ వెనక్కు ఇప్పించి అందరూ తిరిగి కళాశాలలో చేరి చదువుకునేలా ఆర్డినెన్స్‌ తీసుకు రావాలని ఫాతిమా విద్యార్థులు డిమాండ్‌ చేశారు. మంత్రి వద్ద చర్చలు అనంతరం ఫాతిమా విద్యార్థులు సాక్షితో మాట్లాడారు. లాంగ్‌టర్మ్‌ కోచింగ్, ఫీజులు కట్టి చదివించడం వంటివన్నీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement