కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆక్రోశం | Markfed to purchase cotton | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆక్రోశం

Oct 29 2013 12:27 AM | Updated on Oct 1 2018 2:00 PM

పదిరోజుల కింద పత్తిమార్కెట్‌కు తీసుకొచ్చిన మక్కలను ఇంత వరకు మార్క్‌ఫెడ్ వారు కొనుగోలు చేయక పోవడంతో ఆగ్రహించిన రైతులు రెండుసార్లు రాస్తారొకో దిగారు.

సిద్దిపేట టౌన్,న్యూస్‌లైన్: పదిరోజుల కింద పత్తిమార్కెట్‌కు తీసుకొచ్చిన మక్కలను ఇంత వరకు మార్క్‌ఫెడ్ వారు కొనుగోలు చేయక పోవడంతో ఆగ్రహించిన రైతులు రెండుసార్లు రాస్తారొకో దిగారు. సిద్దిపేట పత్తి మార్కెట్‌లో ఓపెన్ ప్లాట్ ఫారాలపై పోసిన 11 కుప్పల మక్కజొన్నలను తేమ పరీక్షలు చేసి బాగున్నాయని మార్క్‌ఫెడ్ వారు ఎంపిక చేశారు. వర్షాలు కురువడం, ఐకేపీకి సమన్వయం లేకపోవడంతో ఇంత వరకు సరుకులను తరలించలేదు. ఆదివారం నుంచి వాతావరణం చక్కబడినప్పడికీ సరుకు తరలించకపోవడంతో సోమవారం ఉదయం రైతులు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రాస్తారోకో చేశారు.
 
 మార్కెట్ అధికారులు, పోలీసులు రెండు గంటల్లో సరుకులను తరలిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు వెళ్లిపోయారు. నాలుగు గంటలైనా పరిస్థితి మారలేదు. దీంతోవారు సమీపంలోని రాజీవ్ రాహదారి చౌరస్తాపై రాస్తారోకోకు దిగారు. దీంతో కరీంనగర్, హైదరాబాద్, సిద్దిపేటవైపు వెళ్తున్న వందలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. వర్షాలతో చెడిపోయిన మక్కలను, మొలక వచ్చిన కంకులను ప్రదర్శించి తమ గొడును వెళ్లబోసుకున్నారు.
 
 సీఎం కిరణ్ డౌన్...డౌన్, మక్కలను వెంటనే కొనాలి.. రైతు వ్యతిరేఖ ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. గంట సమయమైన రైతులు ఆందోళన వీడకపోవడంతో  టూ టౌన్ ఎస్‌ఐ చిట్టిబాబు పోలీసులతో అక్కడికి చెరుకొని రాస్తారోకో విరమించాలని కోరారు. రైతు సంఘల సమాఖ్య నేతలకు, ఎస్‌ఐకి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి అధికారులతో పోలీసులు మాట్లాడి నిలిచిపోయిన సరుకును వెంటనే తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
 
 ఈ ఆందోళనలో రైతు సంఘాల సమాఖ్య నేతలు పాకాల శ్రీహరి రావు, జిల్లా అధ్యక్షుడు హన్మంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏవీ రవీందర్‌రెడ్డి, నాయకులు రాంచందర్ రావు, రాంలింగా రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మయ్య, బాల్‌రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకట్‌రాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కమలాకర్ రావు, భూపతి రెడ్డి, గడీల భైరవ రెడ్డి, పులి రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement