ప్రేమ ఒక్కరిది.. శాపం మరోకరికి..! | love getting many problems to the family | Sakshi
Sakshi News home page

ప్రేమ ఒక్కరిది.. శాపం మరోకరికి..!

Jul 16 2017 8:13 PM | Updated on Sep 5 2017 4:10 PM

ప్రేమ ఒక్కరిది.. శాపం మరోకరికి..!

ప్రేమ ఒక్కరిది.. శాపం మరోకరికి..!

ప్రేమజంట తెచ్చిన తంట అబ్బాయి తల్లిచెల్లెళ్లకు ప్రాణం మీదకు వచ్చింది.

మదనపల్లె: ప్రేమజంట తెచ్చిన తంట అబ్బాయి తల్లిచెల్లెళ్లకు ప్రాణం మీదకు వచ్చింది. అమ్మాయి కుటుంబ సభ్యుల వేధింపులతో వారు ఉక్కిర బిక్కిరి అవుతున్నారు. ప్రేమ జంట ఎక్కడుందో చెప్పండని పోలీసులు, తమ బిడ్డ ఆచూకి తెలపండని అమ్మాయి బంధువులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఆదివారం అబ్బాయి తల్లి, చెల్లి ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన అమ్మాయి బంధువులు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసుల అక్కడికి చేరుకుని వారిని స్టేషన్‌కు తీసుకుపోయి రక్షణ కల్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని కొత్తపల్లెకు చెందిన రెడ్డి బాబు, భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె లావణ్య(22) స్థానికంగా ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అదే వీధిలో ఉంటున్న వెంటకటరమణ కుమారుడు అరుణ్‌ కుమార్‌(25) ప్రేమలో పడింది. ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుండంతో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో అంజనేయస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. గత నెల 20వ తేదీన రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

స్పందించిన పోలీసులు ఇద్దరూ మేజర్లు కావడంతో పెద్దలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అంతటితో వివాదం సద్దు మణిగింది. తర్వాత ఏమి జరిగిందో కానీ ఇరు వర్గాల వారు ఘర్షణ పడుతున్నారు. ప్రేమజంటకు పెళ్లి చేసిన యువకులను పోలీసులు విచారణ పేరుతో ప్రతిరోజూ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులకు అదే సమస్య ఎదురవుతోంది. ఈ వివాదం వెనుక ఓ పార్టీకి చెందిన పెద్దల జోక్యం ఉందని, వారి ప్రోద్భలంతోనే యువకుడి తల్లి, చెల్లిపై దాడి చేసినట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement