
ఇంకా దారులు మూసుకుపోలేదు: లగడపాటి
సమైక్యరాష్ట్రం కోసం ఇంకా దారులు మూసుకుపోలేదని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ: సమైక్యరాష్ట్రం కోసం ఇంకా దారులు మూసుకుపోలేదని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. తమ రాజీనామాలు ఆమోదిస్తే యూపీఏకు బలం తగ్గిపోతుందని చెప్పారు. తమ ఒత్తిడి వల్లే ఇన్నాళ్లు తెలంగాణ ప్రక్రియ ఆగిపోయిందని ఆయన అన్నారు. దత్తపుత్రుడు దొరికిన తరువాత తమని పట్టించుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే బిల్లు ఆగిపోతుందన్నారు. తమని కాదని కేంద్రం ముందుకు వెళ్లలేదని లగడపాటి చెప్పారు.
ఇదిలా ఉండగా, తన రాజీమానా ఆమోదం కోసం లగడపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈరోజు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని,లోక్సభ సెక్రటరీ జనరల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన రాజీనామా ఆమోదించకపోతే నిరసనకు దిగుతానని లగడపాటి హెచ్చరించినట్లు తెలిసింది.