పార్లమెంట్‌కు వెళ్లకుండానే.. సంతకం ఫోర్జరీ చేయించిన కేసీఆర్ : దిలీప్ | KCR indulge forgery: MLC Dileep kumar allegation | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌కు వెళ్లకుండానే.. సంతకం ఫోర్జరీ చేయించిన కేసీఆర్ : దిలీప్

Aug 17 2013 3:44 AM | Updated on Apr 7 2019 3:47 PM

పార్లమెంటుకు వెళ్లకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాన్ని ఫోర్జరీ చేయించిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు తన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్ : పార్లమెంటుకు వెళ్లకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాన్ని ఫోర్జరీ చేయించిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు తన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎల్‌డీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ‘ దిగ్విజయ్‌సింగ్‌తో నాకు 25 ఏళ్లుగా సాన్నిహిత్యముంది. కొందరు టీఆర్‌ఎస్ నేతల విన్నపం మేరకే ఆయన్ను వారికి పరిచయం చేశాను. కాంగ్రెస్‌లో వారి చేరికతో నాకు సంబంధం లేదు’ అని వివరిం చారు. అసలు బ్రోకర్లు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, అన్ని ఆధారాలు తెలంగాణ జేఏసీకి సీల్డ్‌కవర్‌లో పంపిస్తానన్నారు.
 
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ క్రాస్ ఓటింగ్ చేయించారని, ఆయనకు ఈ అంశంతో సంబంధం లేకుంటే ఆ ముగ్గురిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. సినీ పరిశ్రమలోని వారిని ఉద్యమం పేరుతో బెదిరించి దండుకున్న కేసీఆర్ కుటుంబసభ్యుల్లో బ్రోకర్ ఎవరో చెప్పాలన్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్‌ను అవమానించినవారెవరో కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలని సవాల్ విసిరారు. ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని, గద్దర్‌ను, వరవరరావును, పార్టీలోని దళితనేత డాక్టర్ విజయ రామారావును కేసీఆర్ ఎందుకు అవమానించారో చెప్పాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు క్రెడిట్ మొత్తం అమరులకే దక్కుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement