జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం | jeevandhan registrations started in GGH, says gopalakrishnagokale | Sakshi
Sakshi News home page

జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Jan 24 2016 7:26 PM | Updated on Sep 3 2017 4:15 PM

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో జీవన్‌దాన్ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభించామని సహృదయ ట్రస్టు నిర్వాహకులు, ప్రముఖ గుండెమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే చెప్పారు.

గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో జీవన్‌దాన్ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభించామని సహృదయ ట్రస్టు నిర్వాహకులు, ప్రముఖ గుండెమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే చెప్పారు. గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు తమ వద్ద తొమ్మిది మంది గుండె జబ్బు రోగులు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వ అనుమతి రాగానే గుండె మార్పిడి ఆపరేషన్లు ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు ఆలస్యమయ్యే పక్షంలో దాతలు ఎవరైనా ముందుకు వస్తే గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు వైద్య బృందం జీజీహెచ్‌లో సిద్ధంగా ఉందని స్సష్టం చేశారు. బ్రెయిన్ డెడ్ అయినవారి అవయవాలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించేందుకు, ఆపరేషన్ అనంతరం అవసరమయ్యే మందులు, ఆపరేషన్ చేసేందుకు అయ్యే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దాతలు పెద్ద మనస్సుతో ముందుకు రావాలని కోరారు.

సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో గత ఏడాది మార్చి 18 నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు ఎన్టీఆర్‌ట్రస్టు వైద్య సేవ ద్వారా ఉచితంగా బైపాస్‌ సర్జరీలు చేస్తున్నామని తెలిపారు. తమ ట్రస్టు సేవలు జీజీహెచ్‌లో ప్రారంభమై మార్చి 18 నాటికి ఏడాది పూర్తి అవుతుందని, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆపరేషన్ చేసేందుకు ముందుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సుమారు రూ. లక్షన్నర, ఆపరేషన్‌కు రూ. 12 లక్షలు, ఆపరేషన్ చేసిన తొలి ఏడాది మందులు వాడేందుకు రూ. 4 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. తాముచేస్తున ఓపెన్ హార్ట్ సర్జరీలకు గుంటూరుకు చెందిన వైద్య నిపుణులు వైద్య నిపుణులు డాక్టర్ చిరుగుపాటి నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్, ప్రతినెలా కొంత విరాళంగా అందజేస్తున్నారని, దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ అనుమతి వచ్చేలోగా రోగులు ఇబ్బంది పడకుండా గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తామన్నారు. దాతలు 9848045810, 9391029810 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని డాక్టర్ గోఖలే కోరారు.సమావేశంలో సీటీఎస్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్‌లు, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్, డాక్టర్‌ లలిత, కో ఆర్డినేటర్ శాంతి, పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement