పరారైన రిమాండ్ ఖైదీ భీముడు
మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానంటూ ఉడాయింపు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) ఏఎంసీయూ – 1 విభాగంలో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ బి.అజిత్కుమార్ శనివారం పరారయ్యాడు. ఏలూరు జిల్లా పెద్దయోగి మండలం కొప్పలవారిగూడెంలోని నాగన్నగూడెంకు చెందిన అతనిపై 2024లో గుంటూరు జిల్లా తెనాలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో అతడిని తెనాలి ఒకటో పట్టణ పోలీసులు ఈ నెల 24న ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు.
అనంతరం తెనాలి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం రేపల్లె సబ్ జైలుకి తరలించారు. అయితే తనకు ఆస్తమా ఉందని, గతంలో ఎడమ కాలు విరగ్గా శస్త్రచికిత్స చేశారని, ఆ కాలు నొప్పిగా ఉందని చెప్పడంతో రేపల్లె సబ్ జైలు సిబ్బంది పోలీస్ ఎస్కార్ట్తో ఈ నెల 25న గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఏఆర్ పీసీ జి.రాధాకృష్ణ ఎస్కార్ట్ విధుల్లో ఉండగా... మూత్ర విసర్జనకు వెళ్లిన ఖైదీ పరారయ్యాడు.
అతను ఆటోలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్కు, అక్కడి నుంచి కారులో విజయవాడ వారధి వరకు చేరుకున్నట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. రిమాండ్ ఖైదీ పరారీపై ఎస్కార్ట్ సిబ్బంది కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని కోసం గాలిస్తున్నారు.
ముగ్గురి సస్పెన్షన్
గుంటూరు ప్రభుత్వ సమగ్రౖ వెద్యశాల (జీజీహెచ్)లో రిమాండ్ ఖైదీ పరారైన ఘటనలో ముగ్గురు ఏఆర్ పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు.


