ఉద్దానం వీరుడికి ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

ఉద్దానం వీరుడికి ఘన స్వాగతం

Published Thu, Mar 19 2020 11:10 AM

Jawan Dorababu Reached Home After Recovered From Attacks - Sakshi

యుద్ధభూమిలో శత్రువులతో పోరాడి, ఇద్దరిని మట్టుబెట్టిన ఉద్దానం వీరుడు తామాడ దొరబాబుకు స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఆయనను ప్రజలు ఘనంగా సన్మానించారు. ఆర్మీలో పనిచేస్తున్న మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులను మట్టుపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా గాయపడిన దొరబాబు నయమైన అనంతరం స్వస్థలానికి వచ్చారు.

శ్రీకాకుళం, మందస: మాతృభూమి రక్షణలో శత్రువులతో పోరాడి, ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన ఉద్దానం వీరు డు తామాడ దొరబాబు స్వగ్రామం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు 1ఆర్‌ఆర్‌ బెటాలియన్‌లో చేస్తున్నాడు. ఈయనతోపాటు 200 మంది జవాన్లు బృందంగా ఏర్పడి ఈ నెల 9న జమ్మూ కశ్మీర్‌లోని కోజ్‌పూర్‌ గ్రామంలో సెర్చ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా హఠాత్తుగా ఓ ఇంటి నుంచి కాల్పులు ప్రారంభ మవ్వగా సైనికులు తేరుకునే లోపే దొరబాబు కాలికి గాయమైంది. బాధను భరిస్తూనే, ఏకే 47తో ముష్కరులపై దాడికి దిగాడు. పాకిస్తాన్‌కు చెందిన భయంకరమైన టెర్రరిస్టు సాభిర్‌అహ్‌మాలిక్‌ను హతమార్చాడు. మరో ఉగ్రవాదిని కూడా దొరబాబుతోపాటు తోటి సైనికులు హతమార్చారు. ఈ ఎన్‌కౌంటర్‌లో స్వల్పంగా గాయపడిన దొరబాబు కోలుకొని బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు దొరబాబుకు ఎదురెళ్లి, వీరతిలకం దిద్ది, త్రివర్ణ పతా క రెపరెపల మధ్య పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సమావేశంలో దొర బాబు సాహసాన్ని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు బచ్చల మధుబాబు, యోగేశ్వరరావు, కృష్ణారావు, దుమ్ము ధనరాజు,  తామాడ హేమరాజు, మాధవరావు, పందిరి శ్రీను, తాళ్ల తులసీదాసు, ఢిల్లీరావు, పందిరి శ్రీ ను, దున్న కుమారి, బచ్చల లక్ష్మి, నాగమ్మ, తామాడ రెయ్యమ్మ పాల్గొన్నారు.      

ఉద్దానం వీరుడు దొరబాబును సన్మానిస్తున్న చిన్నలొహరిబంద గ్రామ మహిళలు

Advertisement
Advertisement