శబరిమల ఘటనపై కేరళ పోలీసుల దర్యాప్తు
శబరిమలలో చిక్కుల్లో పడిన తెలుగు భక్తులను విడిపించే ప్రయత్నంలో ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది.
- ఉయ్యూరు, విజయవాడలో తనిఖీలు
- పాదరసం విక్రేతను ప్రశ్నించిన పోలీసులు
ఉయ్యూరు (పెనమలూరు): శబరిమలలో చిక్కుల్లో పడిన తెలుగు భక్తులను విడిపించే ప్రయత్నంలో ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు , ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నా... ఫలితం లేకుండానే పోయింది. కేరళ పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడి ప్రభుత్వం, నిఘా విభాగం కేరళ ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు భక్తులు భక్తిభావంతోనే చేశారని, తెలియక జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని నివేదించినా పట్టించుకోలేదు. ఐదుగురుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం, కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలింపు జరిగిపోయాయి.
ఉయ్యూరు, విజయవాడలో దర్యాప్తు..
కేరళ నుంచి పోలీసు బృందం విజయవాడ చేరుకుంది. కమిషనరేట్లో బుధవారం ఆ బృందం కేసు పూర్వాపరాలపై ఆరా తీశారు. అక్కడి నుంచి ఉయ్యూ రు చేరుకుని పూజాసామగ్రి అమ్మిన మణికంఠ జనరల్ స్టోర్స్లో తనిఖీలు నిర్వహించారు. స్టోర్ యజమాని నాగరాజును పాదరసం ఎక్కడి నుంచి కొన్నది, పూజా సామగ్రి ఎవరికి అమ్మినది.. అనే అంశాలపై ప్రశ్నలు వేసి అదుపులోకి తీసుకున్నారు. రహస్యంగా నాగరాజును విజయవాడలో పాదరసం అమ్మే దుకాణం వద్దకు కూడా తీసుకువెళ్లి దర్యాప్తు చేపట్టారు. దుకాణదారుల వద్ద స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లు సమాచారం.