
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శాసనమండలి ఆవరణలో మండలి చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ తమ్మినేని సీతారాం మువన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో షరీఫ్, తమ్మినేని సీతారాం మొక్కలు నాటారు.
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.
- ఒంగోలు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లామంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలందరికీ ఆయన 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్ద్ కౌసల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ పోలీస్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖలోని పోలీస్ బెరక్స్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు వారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.