అమలాపురం టౌన్: అమలాపురం కామాక్షీ పీఠం పెరిగిన ఇద్దరు అనాథ యువతులను ఆదర్శ వివా హం చేసుకునేందుకు ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. ప్రేమ మందిరంలో ఆ అనాథ యువతుల నడత, నమ్రతలను చూసిన ఆ ఇద్దరు యువకులు తమ మనసులోని మాటను తొలుత తమ కుటుంబ పెద్దలకు చెప్పుకున్నారు. తర్వాత ఆ పెద్దలు తమ కొడుకుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ పీఠానికి వచ్చి పీఠాధిపతి కామేశ మహర్షి అంగీకారం, ఆశీర్వాదం తీసుకున్నారు. నిశ్చితార్థాలు కూడా అయ్యాయి.
ఆ ఇద్దరి అనాథ ఆడపిల్లలకు పీఠంలో ఆదివారం రాత్రి వివాహం చేసేందుకు పీఠాధిపతి ముహూర్తాలు నిర్ణయించారు. దీంతో పీఠం పెళ్లి సందడితో కళకళలాడు తోంది. పీఠంలోని ప్రేమమందిరంలో పెరుగుతున్న కామేశ్వరిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన అర్చకుడు సాయి సత్యనారాయణ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. మరో యువతి వల్లిని రామచంద్రపురానికి చెందిన లారీ ట్రాన్స్పోర్టు ఆఫీసు నిర్వహిస్తున్న దైవ వరప్రసాద్ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు.