ప్రత్యేక రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు | general elections in separate state | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు

Dec 10 2013 6:50 AM | Updated on Sep 2 2017 1:27 AM

నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి అన్నారు.

 మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, ప్రత్యేక రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై టీడీపీ, బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలవడం ఖాయమన్నారు.

గతంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ వద్దనందుకే తెలంగాణ ఏర్పాటు చేయలేదని బీజేపీ నేతలే చెప్పారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకం కలిగించడానికి బీజేపీ అడ్డుకునే అవకాశం ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ 2014లో యూపీఏను గెలిపిస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు, సమాచార హక్కు, ఆహార భద్రత, ఉపాధిహామీ చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు.

2014 ఎన్నికల్లో యూపీఏ కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిత్‌కుమార్ సింగ్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు పడమటి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ఇమ్మడి పురుషోత్తం, చంద్రశేఖర్, కృష్ణంరాజు, సాయికేశవ్, నరేష్, సంతోష్, నాగార్జున్‌పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement