అమ్మో.. హోటళ్లు..!

Food Safety Officers Ride on Visakhapatnam Hotels - Sakshi

ఫ్రిజ్‌లలో రోజుల తరబడి ఆహార పదార్థాల నిల్వ

కొన్నిచోట్ల బూజుపట్టిన పదార్థాలూ లభ్యం

విజిలెన్స్, ఆహార భద్రత అధికారుల దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు

విశాఖపట్నం  :మాంసాహార పదార్థాలకు ఇష్టారాజ్యంగా రంగులు కలిపేయడం... రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో భద్రపరచడం... ఓ సారి వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వినియోగించేందుకు నిల్వ చేయడం... నేలపైనే ఆహారం ఉంచడం... వంటశాలలు, ఆ పరిసరాల్లో వెగటు పుట్టించే వాతావరణం... నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కనిపించిన ఈ దృశ్యాలు చూసి విజిలెన్స్‌ అధికారులే విస్తుపోయారు. సోమవారం పలు హాటళ్లలో విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. గాజువాకలోని డైమండ్‌ ఆల్ఫా, ఆలిఫ్, కారు షెడ్‌ కూడలిలోని ప్రిన్స్‌ దాబా, ఆనందపురం మండలంలోని జాతీయ రహదారి పక్కన పెద్దిపాలెం వద్ద ఉన్న ప్యారడైజ్, కామత్‌ హోటళ్లు, అల్లిపురం జ్యోతి థియేటర్‌ పక్కనున్న మానస హోటల్‌లో, రుషికొండ వద్ద రాజు గారి దాబాగా ప్రసిద్ధి చెందిన సీ ఇన్‌ దాబాలో అధికారులు దాడులు చేపట్టారు. వీటి నిర్వహణను చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. చాలా చోట్ల ముందురోజు మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో నిల్వ చేసి మళ్లీ వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల కోసం హైదరాబాద్‌ పంపించి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ప్యారడైజ్, కామత్‌లలో రంగుల మాంసాహారం
ఆనందపురం మండలంలోని జాతీయ రహదారి పక్కన పెద్దిపాలెం వద్ద ఉన్న ప్యారడైజ్, కామత్‌ హోటళ్లపై సోమవారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఏక కాలంలో దాడులు జరిపారు. ఈ మేరకు హోటళ్లలో ఆహార పధార్థాలను, శుభ్రతను పరిశీలించారు. విజిలెన్స్‌ సీఐ బి.నారీమణి, ఫుడ్‌ సేప్టీ అధికారి కె.వెంకట రత్నం, విజిలెన్స్‌ జియాలజిస్ట్‌ భైరాగి నాయుడు దాడులలో పాల్గొన్నారు. తాజాగా వండిన ఆహార పదార్థాలతో పాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలను పరిశీలించారు. హోటళ్లలో ఉన్న మాంసాహారాన్ని పరిశీలించి రంగులు కలిపినట్టు గుర్తించారు. ఈ మేరకు రెండు హోటళ్ల నుంచి మాంసాహార పదార్థాల నమూనాలను పరిశీలన నిమిత్తం సేకరించారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి భూమిలో పాతి పెట్టించారు. రెండు హోటళ్లలోనూ వంట శాలలతో పాటు పరిసర ప్రాంతాలు అధ్వాన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు మొత్తం వివరాలను సేకరించి నివేదికను రూపొందించారు. పరిశీలన అనంతరం కేసులు నమోదు చేస్తామని అధికారులు చెప్పారు.

ఇదీ ప్రిన్స్‌ దాబాలో తీరు, ఎప్పుడో వండిన బిర్యానీ, చికెన్‌
కారుషెడ్‌ కూడలికి సమీపంలోని ప్రిన్స్‌ దాబాపై విజిలెన్స్‌ డీఎస్పీ కె.శ్రావణి ఆదేశాల మేరకు అధికారులు సామవారం దాడులు నిర్వహించారు. వంటశాలలో గతంలో తయారు చేసిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. సుమారు 23 రకాల నిల్వ ఆహార పదార్థాలను వెలుపలకు తీయించారు. వాటిలో వాడిన నూనె, ఎప్పుడో వండిన అన్నం, బిర్యానీ, పలు మాంసాహార పదార్థాలు, పన్నీరు తీయించి మధురవాడ జోన్‌–1 ఆహార భద్రత అధికారి ఎస్‌.జనార్దన్‌ పరిశీలించారు. పరీక్ష నిమిత్తం పదార్థాల నమూనాలు సేకరించారు. దాబా నిర్వహణకు సంబంధించి లోపాలను పరిశీలించారు. తదుపరి చర్యగా దాబా యజమానికి నోటీసులు పంపించి ఆహార భద్రతా చట్టం – 32 కింద కేసు న మోదు చేస్తామన్నారు. పట్టుబడిన నాణ్యత లేని నిల్వ ఆహార పదార్థాలను పారవేయించారు. దాడుల్లో వి జిలెన్స్‌ సీఐ ఎన్‌.శ్రీనివాసరావు, డీఈఈ పార్థసారథి, ఏఈఈ సీహెచ్‌ రామ్‌ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

గాజువాకలో బూజు పట్టిన ఆహారం
గాజువాకలోని రెస్టారెంట్లలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, విజిలెన్స్‌ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. కల్తీ ఆహారం, బూజు పట్టిన ఆహార పదార్థాలను గుర్తించారు. విజిలెన్స్‌ డీఎస్పీ కె.శ్రావణి ఆధ్వర్యంలో సిబ్బంది స్థానిక డైమండ్‌ ఆల్ఫా, ఆలిఫ్‌ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడంతోరెస్టారెంట్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ కె.శ్రావణి మాట్లాడుతూ నగరంలో వివిధ ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. చాలాచోట్ల నిల్వ ఉంచిన పదార్థాలు, బూజు పట్టిన ఆహారాన్ని  విక్రయిస్తున్నారన్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. తనిఖీల్లో సీఐ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

అమ్మో.. మానస హోటల్‌
అల్లిపురం జ్యోతి థియేటర్‌ పక్కనున్న మానస హోటల్‌లో పరిస్థితి చూసి విజిలెన్స్‌ అధికారులు అవాక్కయ్యారు. విజిలెన్స్‌ డీఎస్సీ పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది సోమవారం దాడులు చేశారు. దుర్గందభరితమైన కిచెన్, పరిసర ప్రాంతాలు, బురద, నాచుపట్టిన ప్రదేశాల్లో వంట చేస్తుండడతో విజిలెన్స్‌ సీఐ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా ఉన్న ఈ హోటల్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జీవీఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పారావు ఆహార పదార్థాలను ల్యాబ్‌కు పంపించారు. విజిలెన్స్‌ డీఎస్పీ శ్రావణి పర్వవేక్షణలో జరిగిన దాడుల్లో ఎస్‌ఐ సత్యకుమార్‌ పాల్గొన్నారు.  

ఆహార భద్రతపాటించకుంటే చర్యలు
ఆహార పదార్థాలు తయారు చేసే హోటళ్ల నిర్వాహకులు నాణ్యత పాటించకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు కేసులు నమోదు చేస్తాం. లైసెన్సులు రద్దు చేస్తాం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించం. పారిశుధ్యం పాటించాలి. ఏ రోజు తయారు చేసిన పదార్థాలు ఆ రోజే సరఫరా చేయాలి. నిల్వ చేసిన పాచిపట్టిన పదార్థాలు సరఫరా చేస్తే నేరంగా భావించి చర్యలు తీసుకుంటాం.– జనార్దన్, ఆహార భద్రత అధికారి,మధురవాడ జోన్‌ – 1

రాజుగారి దాబాలోనిల్వ పదార్థాలే
రుషికొండ వద్ద రాజు గారి దాబాగా ప్రసిద్ధి చెందిన సీ ఇన్‌ దాబాలో సోమవారం విజిలెన్స్‌ దాడులు జరిగాయి. కస్టమర్ల ఫిర్యాదుతో విజిలెన్స్‌ డీఎస్పీ శ్రావణి ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు, ఫుడ్‌ నియంత్ర శాక అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఇక్కడ నిల్వ ఉన్న ఆహార పదార్థాలు  బయటపడటంతో అధికారులు కంగుతిన్నారు. మటన్, చికెన్, పీతలు, రొయ్యలు, అన్నం, పప్పు, బిరియాణి, సాంబారు అన్నీ నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ముందు రోజు మిగిలినవి ఫ్రిజ్‌లో పెట్టి వాటిని మళ్లీ వేడిచేసి కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. దీంతోపాటు సాగర్‌నగర్‌ నుంచి రుషికొండ వరకు ఉన్న దాబాలలో ఇలాంటి ఫుడ్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వాటిపైనా దాడులు జరుపుతామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషన్‌ రేవతి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top