ఆదోని: ఆదోని పట్టణ శివారులోని సిరుగుప్ప క్రాస్ వద్ద ఉన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సోదరుడు టీజీ రాఘవేంద్రకు చెందిన స్టార్ న్యూయోకెం కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఆదోని: ఆదోని పట్టణ శివారులోని సిరుగుప్ప క్రాస్ వద్ద ఉన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సోదరుడు టీజీ రాఘవేంద్రకు చెందిన స్టార్ న్యూయోకెం కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కార్మికులకు 90 శాతం, మరో కార్మికుడికి 75 శాతానికి పైగా గాయాలైనట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఫ్యాక్టరీలో కార్మికులకు సరైన భద్రత చర్యలు లేవని, కెమికల్ వ్యర్థాలతో వాతావర ణ, వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతోందని పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఫ్యాక్టరీలోని సోడియం మెటల్ ప్రాసెస్సింగ్ యూనిట్లోని రియాక్టర్లో అకస్మాత్తుగా చెలరేగి అక్కడ పని చేస్తున్న మధ్యప్రదేశ్లోని దివాస్సిటి గ్రామానికి చెందిన సమీర్ శ్రీవాత్సవ్(27), జార్ఖండ్లోని గొలుమారుకు చెందిన పట్టి (28), మెదక్ జిల్ల బుదరి గ్రామానికి చేందిన సంగమేష్(37)కు మంటలు వ్యాపించాయి. సమీపంలో పని చేస్తున్న కార్మికులు మంటలను ఆర్పివేసి క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ఫ్యాక్టరీ మేనేజర్ నారాయణ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్సీ శ్రీనివాసులు, సీఐలు లక్షుమయ్య, శ్రీనివాసులు, ఎస్ఐలు నాగరాజు, మన్మథవిజయ్బాబు, ఈశ్వరయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని డీఎస్సీ తెలిపారు.