వరుస పంటనష్టాలతో అప్పుల పాలై, ఆత్మహత్యకు యత్నించిన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన గొల్లపల్లి అర్జున(32) అనే కౌలు రైతు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
గొల్లప్రోలు (తూర్పు గోదావరి) : వరుస పంటనష్టాలతో అప్పుల పాలై, ఆత్మహత్యకు యత్నించిన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన గొల్లపల్లి అర్జున(32) అనే కౌలు రైతు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. అర్జున వరి, పత్తి సాగు చేస్తున్నారు. కాగా గత ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలకు, చీడ పీడలకు పంట దెబ్బ తినడంతో రూ.5 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆయన ఈ నెల 15న పత్తి చేను వద్ద పురుగుల మందు తాగారు. అపస్మారకస్థితికి చేరిన ఆయనను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. అర్జున మృతితో భార్య నాగమణి, కుమారులు శ్రీరామ్, వెంకటేష్, కుమార్తె శిరీష దిక్కులేని వారయ్యారు. గొల్లప్రోలు రెవెన్యూ అధికారులు అర్జున ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. గొల్లప్రోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
10 నెలల్లో ఐదుగురి ఆత్మహత్య
గొల్లప్రోలు మండలంలో గత10 నెలల వ్యవధిలో ఐదుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా వారిలో ముగ్గురు గొల్లప్రోలుకు చెందిన వారే. గతేడాది అక్టోబర్ 18న చేబ్రోలుకు చెందిన పెద్దింటి వీరరాఘవ(40), ఈ ఏడాది జనవరి 25న ఏకే మల్లవరానికి చెందిన పాలెపు జోగిరాజు(47), ఏప్రిల్ 11న గొల్లప్రోలుకు చెందిన రామిశెట్టి రామకృష్ణ, జూలై 7న గొల్లప్రోలుకు చెందిన కొత్తెం సూర్యారావు(30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదంతాలతో కౌలు రైతుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.