ఏంటి.. ఇలా జరుగుతోంది..! | Engineering seats are not Replaced | Sakshi
Sakshi News home page

ఏంటి.. ఇలా జరుగుతోంది..!

Jul 13 2015 2:43 AM | Updated on Sep 3 2017 5:23 AM

ఇటీవల జరిగిన మొదటి విడతకౌన్సెలింగ్‌లో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదు. కనీస స్థాయిలో

ఇంజినీరింగ్ కళాశాలల్లో సగం సీట్లే భర్తీ
 
 కడప ఎడ్యుకేషన్ : ఇటీవల జరిగిన మొదటి విడతకౌన్సెలింగ్‌లో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదు. కనీస స్థాయిలో కూడా విద్యార్థులు చేరకపోవడంతో ఇంజీనీరింగ్ కళాశాలల యాజమాన్యం ఆందోళన చెందుతోంది. గతేడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావటంతో చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. కానీ ఈసారి మాత్రం సకాలంలోనే కౌన్సెలింగ్ జరిగింది. కానీ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం ఊహించినంత స్పందన మాత్రం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించటంతోపాటు వేలకు వేలు వెచ్చించి అధ్యాపకులను నియమించుకున్నారు. కానీ విద్యార్థులు చేరకపోతే పరిస్థితి ఏమిటని మథనపడుతున్నారు. జిల్లాలో మొత్తం 21 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 10,500 సీట్లు ఉండగా ఇందులో సగం సీట్లు కూడా భర్తీ కాలేదని తెలిసింది. జిల్లా వ్యాప్తంగా రెండు మూడు కళాశాలల్లో మాత్రమే వందశాతం సీట్లు భర్తీ అయినట్లు సమాచారం.

కొన్ని కళాశాలల్లో పది నుంచి యాభై లోపు సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలిసింది. మరికొన్ని కళాశాలల్లో మాత్రం బోధన సిబ్బంది, వసతులు కళాశాల పేరును పరిగణలోకి తీసుకుని పలువురు విద్యార్థులు చేరేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు ఎక్కువగా ఉండటం విద్యార్థులు తక్కువగా ఉండటంతో కళాశాల యాజమాన్యాలను ఆందోళన వెంటాడుతోంది. దీంతో రెండవ విడత కౌన్సెలింగ్‌పై వారు ఆశలు పెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement