మరింత తగ్గిన మరణాల రేటు | Death toll of Corona victims in AP is Reduced | Sakshi
Sakshi News home page

మరింత తగ్గిన మరణాల రేటు

Jun 7 2020 4:13 AM | Updated on Jun 7 2020 4:13 AM

Death toll of Corona victims in AP is Reduced - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బాధితుల మరణాల రేటు మరింత తగ్గింది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. దీంతో మొత్తం మరణాల రేటు 1.64 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 73గా ఉంది. శుక్రవారం ఉ. 9 గంటల నుంచి శనివారం ఉ.9 గంటల వరకు 12,771 మందికి పరీక్షలు నిర్వహించగా 210 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 41 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,460కు చేరింది. ఇందులో 741 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కాగా, 131 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 45 మందిని కొత్తగా డిశ్చార్జి చేయడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,601కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,786గా ఉంది.

సున్నాకు చేరిన వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు: రాష్ట్రంలో రెడ్‌ క్లస్టర్ల (వెరీ యాక్టివ్‌ క్లస్టర్ల) సంఖ్య సున్నాకు చేరింది. రెండ్రోజుల క్రితం 9గా ఉన్న రెడ్‌ క్లస్టర్ల సంఖ్య శనివారం నాటికి సున్నాకు చేరింది. వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా చెప్పుకునే వీటిలో పాజిటివ్‌ కేసులు నమోదైన రోజు నుంచి 5 రోజుల లోపల తిరిగి నమోదవుతాయి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 393 క్లస్టర్లు ఉన్నాయి. అందులో గ్రీన్‌జోన్‌లో 201 ఉన్నాయి. 6–14 రోజులలోగా నమోదయ్యే యాక్టివ్‌ క్లస్టర్లు 92, 15 నుంచి 28 రోజుల్లోగా నమోదయ్యే డార్మెంట్‌ క్లస్టర్లు 100 ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement