‘విజయవాడలో తెల్లవారుజాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్’
న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి 12.30 వరకే అనుమతి
ప్రైవేటు ప్రోగ్రామ్స్కు అనుమతి తప్పనిసరి
యువతులపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
వెల్లడించిన సీపీ ద్వారకా తిరుమలరావు
సాక్షి, విజయవాడ : న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి అపశృతి జరగకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని అంక్షలు విధించారు. నగరంలో నూతన సంవత్సర వేడుకలకు రాత్రి 12.30 గంటల వరకే అనుమతి ఉంటుందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు ప్రోగ్రామ్స్కు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళలు, యువతులపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్లపై కేక్ కటింగ్స్ కార్యక్రమాలు చేయరాదని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెక్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జౌటర్ రింగ్ రోడ్స్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 31వ తేదీ అర్ధరాత్రి నుంచి 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.