‘ఆయుష్మాన్‌ భారత్‌’తో కార్పొరేట్‌ వైద్యం

Corporate Treatment In Ayushman Bharat In Chittoor - Sakshi

పేదలకు ఉచిత వైద్య అందివ్వనున్న కేంద్రం

వచ్చేనెల 25న ప్రారంభిస్తామన్న మోదీ

జిల్లాలో 7 లక్షల కుటుంబాలు ఎంపిక

చిత్తూరు అర్బన్‌:ఈనెల 15న ప్రారంభం కావాల్సిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే నెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రధా ని మోదీ ఇటీవల ప్రకటించారు. దీనికి ఎవరు అర్హులు, పథక ఉద్దేశం ఏమిటని చాలా మందికి తెలియడం లేదు. పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారికోసం మాత్రమే ఉద్దేశించింది కాబట్టి అందరూ అర్హులు కాదు. మోదీ కేర్‌గా కూడా వ్యవహరిస్తున్న ఈ పథకంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వైద్య సహాయం పొందవచ్చు. దేశంలో 10.74 కోట్ల కుటుంబాలకు (సుమారు 50 కోట్ల మందికి) మోదీ కేర్‌ వర్తిస్తుందని ప్రభుత్వం చెబు తోంది. జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి న యంత్రాంగం తొలిగా 7 లక్షల మందిని ఈ పథకానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దశలవారీగా అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.

పథక లక్ష్యం...
ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా
సామాజిక ఆర్థిక కులగణన ఆధారంగా అర్హత ఆధారపడి ఉంటుంది
ప్రభుత్వాస్పత్రి లేదా ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు
ప్రారంభమైన మొదటి రోజు నుంచే అన్ని వ్యాధులకూ వర్తిస్తుంది
ఏదైనా వ్యాధితో ఒకసారి చికిత్సపొందితే మళ్లీ చికిత్స కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు
ఆధార్‌కార్డు తప్పనిసరి కాదు. నిర్దేశించిన గుర్తింపు ధ్రువీకరణ ఉండాలి

వీళ్లు అర్హులు..
గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా గోడలు, కచ్చా పైకప్పుతో ఒకే గదిలో నివాసముంటున్న కుటుంబాలు
16 నుంచి 59 ఏళ్ల వయోజనులు లేని కుటుంబాలు
16 నుంచి 59 ఏళ్ల లోపు పురుషులు లేని మహిళ కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు
దివ్యాంగులైన సభ్యుడు ఉన్న కుటుంబాలు, శరీర సామర్థ్యం గల వయోజనులు ఒక్కరూ లేని కుటుంబాలు
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు
రోజూవారీ కూలిపై ఆధారపడిన భూమిలేని కుటుంబాలు
అనాథలు, యాచకులు
చేతితో పారిశుద్ధ్య (స్కావెంజర్‌) పనిచేసే కుటుంబాలు
ఆదిమ గిరిజన వర్గాలు
చట్టబద్ధంగా వెట్టిచాకిరి నుంచి విముక్తులైన వారు

పట్టణ ప్రాంతాల్లో...
చెత్త ఏరుకుని బతికేవారు, యాచకులు
ఇళ్లల్లో పనిచేసే వాళ్లు
వీధుల్లో తిరిగి వస్తువులు అమ్మేవారు, చర్మకారులు, వీధుల్లో ఉండి పనిచేసేవారు.
నిర్మాణ కార్మికులు, ప్లంబర్, మేస్త్రీ, పెయింటర్, వెల్డర్, సెక్యూరిటీ గార్డు, కూలీ, బరువులు మోసే కార్మికులు
స్వీపర్, పారిశుధ్య కార్మికుడు, తోటమాలి
చేతివృత్తి కార్మికులు, టైలర్లు, ఇంటి వద్ద ఉండి పనిచేసుకునే వారు
రవాణా కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, సహా యకులు, తోపుడు బండి రిక్షా కార్మికులు
దుకాణాల్లో పనిచేసేవారు, సహాయకులు, చిన్న సంస్థల్లో ప్యూన్లు, అటెండర్లు, వెయిటర్లు
ఎలక్ట్రీషియన్లు, మెకానిక్, అసెంబ్లర్, మరమ్మతు కార్మికుడు.
రజకులు, కాపలాదారులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top